వైయస్ఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన ఏకైక నాయకుడు పవన్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ.రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నడుస్తున్నాడని, బాబు సూచనల మేరకే రోజుకొక ముసుగు ధరించి వైయస్ఆర్ సీపీపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సీ.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైయస్ఆర్ సీపీని విమర్శిస్తున్నాడని, ఇప్పటికీ చంద్రబాబు బినామీ పవనే అని ఎద్దేవా చేశారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్.. గత ఐదేళ్లు టీడీపీ హయాంలో అవినీతి జరుగుతుంటే నిద్రపోయావా ? అని నిలదీశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా వామపక్షాలతో కలిసి ప్రచారం చేశాడని, ఇప్పుడు ఆయన సూచనలతోనే బీజేపీ చంకనెక్కాలని చూస్తున్నాడన్నారు. రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ అమర్యాదగా మాట్లాడడం ఏంటని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అంటూ అవహేళనగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు పవన్ యత్నిస్తున్నాడని, కులాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది నీవు కాదా పవన్ అని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి దాన్ని రాద్ధాంతం చేశారని, గతంలో ఇంగ్లిష్లో ట్వీట్లు పెట్టినప్పుడు తెలుగు చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. రేపిస్టులకు రెండు చెంప దెబ్బలు చాలని పవన్ కల్యాణ్ అనడం సిగ్గుచేటన్నారు. అవగాహన లోపంతోనే పవన్ ఇలా మాట్లాడుతున్నాడని, పవన్ రాజకీయ అజ్ఞాని అన్నారు. Read Also: రాజధాని రైతులు, కూలీల రౌండ్టేబుల్ సమావేశం