కూటమి ఏర్పడిన తరువాత ఈసీ వ్యవహార శైలి మారింది

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది

పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెళ్లి వీడియో ఎలా బయటికి వచ్చింది? 

టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?

టీడీపీ నేతల ఆరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదు?

బాధితులు రీ పోలింగ్‌ అడగాలి..టీడీపీ ఎందుకు అడగట్లేదు?

ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? 

సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తరువాత ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలి మారిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలీ, టీడీపీ, ఎల్లోమీడియా టెర్రిరిజంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. 

పరీక్ష రాశాక వంద శాతం మార్కులు రావాలని టార్గెట్‌ పెట్టుకుంటాం. మేం పరీక్షలు అలాగే రాశాం. బెట్టింగుల కోసమో, సోషల్‌ మీడియాలో సర్క్యూలెట్‌ చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని మేం భావించడం లేదు. అలాంటి తాత్కాలిక ఆనందం మేం కోరుకోవడం లేదు. రాష్ర్టంలో ఎన్ డి ఏ అధికారంలోకి రానుందంటూ అమిత్ షా చేసిన కామెంట్స్ పై అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ బహుశా బీజేపీ వాళ్లు, అమిత్‌ షా నార్త్‌లో వారికి కలిసి వస్తుందని అనుకుంటున్న ఊహగానాల ప్రకారం మాకు(బిజేపికి) సౌత్‌లో బ్యాలెన్సింగ్‌ అవుతుందని అక్కడి ఓట్ల కోసం కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు

 

     అయినా ఫలితం ఈవిఎంలలో నిక్షిప్తమైన తరువాత ఊహగానాలతో పని ఉండదు. టీడీపీ ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌పై ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌పై నమ్మకం పెట్టుకున్నారు. గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌పై సీరియల్‌ నంబర్‌ లేదని ఓట్లను రిజెక్ట్‌ చేశారు.గుంటూరులో అలా మన పార్టీకి నష్టం జరిగింది. ఈసారి ఏమీ లేకున్నా పరిగణలోకి తీసుకోవాలని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఏ గైడ్‌లైన్స్‌ ఇచ్చినా దేశమంతా ఒకే విధంగా ఉండాలి. మాకు దానిపై ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. దేశమంతా ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలు చేయాలని మేం కోరుతున్నాం. ఇక్కడ డిఫరెంట్‌గా ఏపి ఈసి ఇచ్చిన గైడ్‌లైన్స్‌పై ఇవాళ వినతిపత్రం కూడా ఇచ్చామని తెలియచేశారు 

 

       గత 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతుందో అందరూ గమనించాలి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్‌గా అక్కడ కుట్ర జరుగుతోంది. మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లోమీడియా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌  నిష్పక్షపాతంగా  వ్యవహరించాలన్నదే మా ఆశ. అందుకోసమే మేం ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి మా పార్టీతోపాటు, ముఖ్యమంత్రితో సహ ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలన్నింటికి సమానంగా వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని మేం కోరుకున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్‌ సోకినట్లుగా ఉంది.

 

     ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈసీ జోక్యం మాచర్ల కేసులో తీవ్రంగా కనిపిస్తోంది. మాచర్లలో వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదు. ఎన్నికల్లో జరిగిన అన్ని ఘటనల వీడియోలు బయటపెట్టాలి. అసలు వీడియో ఎలా బయటకు వచ్చిందో ఈసీనే సమాధానం చెప్పాలి. ఇంతవరకు దానిపై సమాధానం లేదు. మాచర్లలోనే పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. ఆ వీడియోలు ఎందుకు బయటకు తీయడం లేదు. పాల్వాయ్‌ గేట్‌ ఏరియాలో టిడిపి వాళ్ళు మా పార్టీవారిపై దాడులు చేశారు.సాధారణ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేశారు.

మాచర్ల ప్రాంతంలో టీడీపీ ఎందుకు రీ పోలింగ్‌ కోరడం లేదంటే..అక్కడ ఆ పార్టీ రిగ్గింగ్‌ చేసుకుంది కాబట్టే మౌనంగా ఉంటున్నారు.పోలింగ్ రోజు ఎంఎల్ఏ దాడి చేసిఉంటే సిఐ ఎందుకు ఊరుకున్నారు. కోర్టును కూడా డైవర్ట్‌ చేసే విధంగా పది రోజులు సీఐ ఎక్కడ నిద్ర పోతున్నారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా మళ్లీ అరెస్టు చేయాలని కేసులు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఎందుకు పక్షపాత దోరణిలో వ్యవహరిస్తుందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. సీఐ తరఫున ప్రైవేట్‌ లాయర్‌ వచ్చి మాట్లాడుతున్నారు. బెయిల్‌ ఇచ్చిన తరువాత పిన్నెల్లి నరసారావుపేటకు వస్తే కూడా అడ్డుకుంటున్నారు.

మాచర్ల ఎమ్మెల్యేపైనే ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు. పూర్తిగా కక్షసాధింపుతో చంద్రబాబు రిమోంట్‌కంట్రోల్‌గా ఎన్నికల కమిషన్, పోలీస్‌యంత్రాంగం వ్యవహరిస్తుందన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది. సహజ న్యాయసూత్రాల ప్రకారం చూసినా కూడా టీడీపీ ఎందుకు రీ పోలింగ్‌ అడగడం లేదు. మా అభ్యర్థికి అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్‌ అడిగారు. ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు రూల్స్‌కు విరుద్ధంగా  వ్యవహరించారు. పోలీసులు మా వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారు. వాటిపై ఏం కేసులు పెట్టారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పోలింగ్‌ అయిపోయిన తరువాత బైండోవర్, రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఎల్లోమీడియాలో వచ్చిన బ్యానర్‌ వార్తల ఆధారంగా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇదంతా తాత్కాలికమేనని అన్నారు.

 ఫలితాల అనంతరం వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు గతంలో ఎన్నికల కమిషన్‌పై ఎలా దాడికి వెళ్లారో చూశాం. వైయస్‌ జగన్‌ ఎప్పుడూ ఈసీపై చంద్రబాబులా వ్యవహరించలేదు. అధికార వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది. కౌంటింగ్‌ సమయంలోనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవరించాలని మేం కోరుతున్నాం. కేవలం వ్యవస్థలను మేనేజ్‌చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 

  అధికారులను టెర్రరైజ్‌ చేసి బెదిరించి తమ వైపు తిప్పుకునేలా చంద్రబాబు, టీడీపీ వ్యవహరిస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం, దారిలోకి రాని వాళ్లను మీడియాతో గ్లోబెల్స్‌ ప్రచారంతో కాళ్ల బేరానికి తెచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. ప్రధాని మోదీనే చంద్రబాబు, ఎల్లోమీడియా గ్లోబెల్స్‌ ప్రచారానికి తట్టుకోలేకపోయాడు. వ్యక్తిత్వ హననం చేసి లబ్ది పొందాలన్నదే చంద్రబాబు నైజం. ఎన్నికల సమయంలో చీఫ్‌ సెక్రటరీని తప్పించాలని ప్రయత్నం గత రెండునెలలుగా చేస్తున్నారు. టీడీపీ అనేది అబద్ధాలపై బతుకుతున్న పార్టీ. వ్యవస్థను తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. వైల్డ్‌ ఆరోపణలతో సీఎస్‌ను తప్పించాలనే ఇన్‌ఫ్లూయన్స్‌ చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి.

వారం రోజుల తరువాత టీడీపీ పీడ పోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా ఉంటే వైయస్‌ జగన్‌కు అడ్వంటేజ్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారు. ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు పవర్‌లో ఉండేది ఎన్నికల కమిషన్‌ కాబట్టి మేం కూడా ఈసీకి ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

కక్షసాధింపు చర్యలతోనే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని మాచర్లకు రాకుండా అడ్డుకుంటుంది. ఆయన వస్తే పట్టుకునేందునేందుకు పది నిఘా బృందాలను పంపించడం, ఆయనేదో పది మర్డర్లు చేసినట్లుగా ఈసీ వ్యవహరించడం, టెర్రరైజ్ చేయడం దేనికి సంకేతమని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పారదర్శకంగా కౌంటింగ్‌ జరగడం వీళ్లకు ఇష్టం లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతల హత్యా రాజకీయాలను వ్యతిరేకించేవారు ఉంటే అడ్డమని భావించి ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Back to Top