తాడేపల్లి: రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని, కేంద్రం చెప్పింది కూడా అదేనని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుందన్నారు. అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు, ఎల్లో మీడియా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్కడ కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది.. అదొక్కటే రాజధానిగా మేం గుర్తిస్తున్నాం అని కేంద్రం అనలేదు. అనకపోయినా అలా అన్నట్లు వక్రీకరిస్తూ నిన్నటి నుంచి టీడీపీ కరపత్రాలు ఈనాడు, ఆం«ద్రజ్యోతితో పాటు, తోక చానళ్లు చేస్తున్న రాద్దాంతం చేస్తున్నాయి. దాన్ని పట్టుకుని చంద్రబాబునాయుడు పరాకాష్టగా అనేకం మాట్లాడుతున్నాడు.
*మతి చలించి నిస్పృహతో..:*
చంద్రబాబుకు ఈ మధ్య కాలంలో అలవాటైన తిట్లు శాపనార్ధాలు పెట్టారు. మతి చలించిన ఆయన నిస్పృహతో ఉండి.. మాకు నూకలు చెల్లాయంటూ, దింపుడు కల్లం ఆశతో అసభ్యంగా మాట్లాడటం, దారుణంగా తిట్టడం చేస్తున్నాడు. సీఎంగారి గురించి తన స్థాయి మర్చిపోయి శాపనార్ధాలు పెడుతున్నాడు.
*బాబు–బ్రోకర్ పని:*
భూముల విలువ పెంచుకుని తానూ, తన కోటరీ ప్రయోజనం పొందాలనుకున్న చంద్రబాబు, రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక బ్రోకర్లా పని చేస్తున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎలా ధరలు పెంచేలా మాట్లాడతాడో అలానే ఈరోజు చంద్రబాబు చేశాడు. ఆరోజూ చంద్రబాబు ఒక ప్రభుత్వంలా వ్యవహరించలేదు. ఇప్పుడు నోటికాడికి వచ్చింది పోయిందనే దుగ్ధతో ఉన్నాడు. అందుకే ఏ చిన్నపాటి ఆశ కన్పించినా అమరావతి రాజధాని అంటూ మళ్లీ తెర మీదకు వస్తున్నాడు
తన ముఠాకు ఆదాయం సంపాదించి పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు
*నాడు నాజీలను మించి నిఘా:*
నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు బయటకు వెళ్లేటప్పుడు మాపై నిందలు వేయడం కోసం రికార్డు చేసిన సంభాషణ బయటకు వచ్చింది
నీ నోటి దూల వల్ల అనవసర రాద్ధాంతం అవుతుందని హెచ్చరించినందుకు దాన్ని ఆయన ఫోన్ ట్యాపింగు అంటూ నిర్వచనం ఇచ్చారు. దాన్ని వీళ్లు ఎత్తుకుని మాపై నిందలు వేయడం, ఈ రోజు చంద్రబాబు రిపీట్ చేస్తూ వెళ్తున్నాడు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు.. నాపై ఫోన్ ట్యాపింగ్ పెట్టినప్పుడు నేనే మీపై కేసు వేశాను. నా నంబర్ పై ప్రభుత్వం ఫోన్ ట్యాపింగు కోసం రిక్వెస్ట్ పెట్టి జాతీయ విద్రోహశక్తుల్లా ట్యాపింగ్ పెట్టావు. ఆనాడు నేను హైకోర్టులో కూడా కేసు వేశాను. మీకు నోటీసులు కూడా వెళ్లాయి.
నాజీలు చేసినట్లు అందరిపై నిఘా పెట్టి అన్నీ తెలుసుకున్నట్లు మీ ఐదేళ్ల పాలనలో కూడా వ్యక్తిగత దాడులు చేశారు. విభజన తర్వాత మాత్రమే మన రాష్ట్రంలో అలాంటివి ఏబీ వెంకటేశ్వరరావు సారధ్యంలో జరిగాయి. ఇజ్రాయేల్ నుంచి స్పైవేర్ తెప్పించి ఎలా చేశారో మేం ఆధారాలతో నిరూపించాం. ప్రభుత్వాలు ఉండేది అందుకు కాదు..మా ప్రభుత్వం మాత్రం ప్రజల అభిమానాన్ని చూరగొనడంలోనే నిమగ్నమైంది
మీలా అడ్డదారుల్లో బ్లాక్ మెయిల్ చేసి వారి ఫోన్ ట్యాపింగులు చేసే అలవాటు జగన్ గారిది కాదు. ట్యాపింగు అంటే మీరు చేసింది...మేం కాదు.
*బాబు నిస్సిగ్గు మాటలు:*
సెక్షన్–30 తెలియకుండానే ఆనాడు మాపై ఆంక్షలు విధించావా...?
సెక్షన్ 30 అనేది అసలు చంద్రబాబుకు తెలియదట..అసలు ఆ మాట చెప్పడానికి నోరెలా వచ్చింది. నీకు తెలియక పోతే నీ హయాంలో సెక్షన్ 30 అమల్లో ఉందని ఏ రకంగా నిర్భందాలు òపెట్టావో గుర్తు లేదా..?
కనురెప్పలు కూడా ఆర్పకుండా అబద్దాలు అడటం ఆయనకే చెల్లు.
*ఎడిట్ చేసిన వీడియో ప్రదర్శన:*
జగన్ గారి మాటలు కట్ చేసి చూపించడానికి సిగ్గనిపించలేదా..?
జగన్ గారు 30వేల ఎకరాలకు ఒప్పుకున్నారు అని కట్ చేసిన వీడియో చూపించాడు. అసెంబ్లీలో మాట్లాడింది అలా కటింగ్ చేసిపెట్టడం నా స్థాయికి సరికాదు అని చంద్రబాబు అనుకోలేదు. 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమే కావాలని జగన్ గారు అన్నది మాత్రం కట్ చేశాడు.. నిస్సిగ్గుగా దాన్ని ప్లే చేశాడు.
45 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఈరోజుకూడా ప్రతి పక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఇలా చేయడానికి సిగ్గు ఉండొద్దు..? మాట మాట్లాడే ముందు నేను తప్పు చెప్తున్నాను.. పట్టుకుంటారు అనే స్పృహ అయినా ఉండాలి కదా? జగన్మోహన్రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకూ చెప్తోంది ఒకటే.. ప్రభుత్వ భూమి ఉండాలనే కోరారు.
*ఆ రెండూ ఆయనకే వర్తిస్తాయి:*
అబద్దాల కోరు..సైకో అని నిర్వచనాలకు అన్వయం అయ్యేది చంద్రబాబుకే. ఆయన ముఖంలో, కళ్లలో ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తుంటాయి. నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నాడు. అందుకే చంద్రబాబు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆనాడు వైఎస్సార్ గారు అన్నారేమో?. నోరు తెరిచి అబద్దం మాట్లాడకపోతే చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందేమోననే అనుమానం వస్తోంది. ఇది ప్రజలకు తెలుసు...ప్రజలకు తెలుసు అని చంద్రబాబుకీ తెలుసు. అయినా అదే మాట్లాడతాడు...ప్రజలకి జ్ఞాపకశక్తి తక్కువ అనుకుంటాడు.
*కేంద్రానిది స్పష్టమైన వైఖరి:*
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే అని కేంద్రం ఎప్పుడో చెప్పింది:
ఇక్కడ హైకోర్టులో కూడా కేంద్రం ఇదే కేసులో 13204/2020 కింద అఫిడవిట్ వేసింది. ఇప్పుడు సుప్రీంలో నడుస్తున్న కేసులో కేంద్రం ఏదైతే అఫడవిట్ వేసిందో అదే అప్పట్లో ఏపీ హైకోర్టులోనూ వేసింది. సీఆర్డీఏ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం చేసేటప్పుడు కేంద్రాన్ని సంప్రదించలేదు అని ఆ అఫడవిట్లో కేంద్రం పేర్కొంది. సంబంధిత వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది.. కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేనిదని చెప్పారు.
రాజధాని నగరాన్ని నిర్ణయించుకునే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిదే.. కేంద్రానికి ఏ మాత్రం పాత్ర దీనిలో లేదు అని చెప్పింది.
ఈ అంశాన్ని కేంద్రం తాను వేసిన అఫడవిట్లోని పాయింట్ 7 లో పేర్కొంది. కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. విభజన చట్టంలో ఏముందో దాని ప్రకారం మేం చెప్పాము అని ఇప్పుడు కూడా కేంద్రం చెప్తోంది.
దాని ప్రకారం కమిటీ వేయాలని శివరామకృష్ణన్ కమిటీ వేశామని కూడా చెప్పారు. చట్టం ప్రకారం ఆర్ధిక సహకారం కింద రూ.2500 కోట్లు అందించామనీ చెప్పారు. వాళ్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశామని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత చట్టం ప్రకారం అమరావతి రాజధాని అని వాళ్లు నోటిఫై చేశారు.
ఆ తర్వాత 2020లో ఇప్పటి ప్రభుత్వం ఆ చట్టాన్ని రిపీల్ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెడుతూ వారు చట్టం చేశారని చెప్పారు. అప్పుడు వాళ్లు అమరావతి అన్నప్పుడు, మేం మూడు రాజధానులు అన్నప్పుడు కూడా కేంద్రాన్ని సంప్రదించలేదనే వారు చెప్తున్నారు. ఎందుకు సంప్రదించలేదంటే వాళ్లకేం సంబంధం లేదనేది స్పష్టంగా ఉంది.అదే అంశం కేంద్రం వేసిన అఫడవిట్లో కూడా స్పష్టంగా ఉంది
*హడావిడిగా రాజధాని ప్రకటన:*
నేను ఒకటే చంద్రబాబును అడుగుతున్నా.. మీరు అమరావతి అన్నప్పుడు కేంద్రాన్ని సంప్రదించారా..? చట్టంలో ఉన్న ప్రకారం వేసిన శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడైనా అమరావతి అనుకూలమైన ప్రదేశం అని చెప్పిందా..? ఆ కమిటీ అసలు అమరావతి అనేది సరికాదన్నట్లు నివేదిక ఇచ్చింది.
ఆనాడు ఆగస్టు 27, 2014లో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. చట్ట ప్రకారం ఓ కమిటీ రాజధానిపై పనిచేస్తుంటే దానికంటే ముందే జులై 20వ తేదీన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కమిటీ వేస్తావా..? రాజధాని ఎంపిక విషయంలో అసలు నారాయణ నైపుణ్యం ఎంత..? శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆయనతో కమిటీ ఎలా వేశావ్..? ఒక వారం రోజులు తిరగకముందే మంత్రి నారాయణ రాజధాని గుంటూరు–విజయవాడల మధ్య ఉంటుందని ప్రకటన చేశాడు.
కేంద్రానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఆగస్టు 27న ఇస్తే వారం రోజులు కూడా కాకముందే 03.09.2014న రాజధాని ప్రాంతంపై అసెంబ్లీలో తీర్మానం చేశారు.
*నిపుణుల కమిటీ వద్దన్నా..:*
నిపుణుల కమిటీ ఎక్కడైతే వద్దందో అక్కడే రాజధాని పెట్టాడు. నిపుణుల కమిటీ వివిధ అంశాలను సూచిస్తూ వికేంద్రీకరణ ఎందుకు అవసరం అనేది కూడా చెప్పింది. వారి నివేదిక సారాంశం అంతా చూస్తే రాజధాని ఒక ప్రాంతం కంటే వికేంద్రీకరణే ముఖ్యమనేది స్పష్టం అవుతుంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఖర్చు ఎక్కువవుతుంది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోండని పెద్దమనిషిలా కమిటీ చెప్పింది. ఆ కమిటీ నివేదిక వచ్చాక అంశాలను పరిశీలించి కావాలంటే మరొక కమిటీ వేసినా దానికో అర్ధం ఉండేది. ఆ కమిటీ నివేదికను పట్టించుకోలేదు. కేంద్రం నుంచి నివేదిక తీసుకుని దాని ప్రకారం చేస్తాననీ అనలేదు. వాళ్లు ఎక్కడైతే వద్దు అన్నారో అక్కడే రాజధాని పెట్టడానికి సిద్ధపడ్డారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే చెప్పారో అదే ఆ కమిటీ నివేదికలో కూడా చెప్పింది. ఇక్కడ ఉన్న భూమి వీక్. నిర్మాణ ఖర్చు ఎక్కువవుతుంది..ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంటే మంచిదని వారు సూచనలు చేశారు. దాన్ని పక్కకు తోసేసి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే సొంత కమిటీని వేసుకుని రాజధానిని ప్రకటించాడు. నా నిర్ణయమే భారత రాజ్యాంగం కంటే గొప్పది. దాన్ని వ్యతిరేకిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అంటే ఎలా కుదురుతుంది..?
*సొంత వారి జేబులు నింపుకోడానికే..:*
ఆ రోజూ నువ్వు పట్టించుకోకపోగా.. రాష్ట్రం కోలుకోలేనంతగా నీ సొంత జేబులు నింపుకోడానికి బంగారు బాతులా అమరావతిని అనుకున్నావ్. ఇక్కడ రాజధాని రావాలి..రాష్ట్రం బాగుపడాలి అని మాత్రం అనుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేశాడో అందరికీ తెలుసు..నిన్ను ఎవరు కట్టొద్దన్నారు. మొత్తం కలిపి 5 వేల కోట్లు మాత్రమే అక్కడ ఖర్చు చేశాడు. భూములను బినామీ పేర్లమీద మార్చుకోవడం, లంక, అసైన్డ్ భూములను బెదిరించి ఎలా తీసుకున్నారో ఆధారాలతో ఉన్నాయి.
ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందనేదీ ఆధారాలు ఉన్నాయి. అందుకే రాజధానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
చారిత్రాత్మకంగా వికేంద్రీకరణ నినాదాన్ని నెరవేర్చే ఒక అవకాశం కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నీ కక్కుర్తితో దీన్ని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకోవాలని చూసి ఏ పనీ చేయనందువల్ల మాప్రభుత్వానికి ఖర్చు తగ్గించావు.
మరో వైపు అక్కడి కుంభకోణాలన్నీ కళ్ల ముందు కన్పిస్తున్నాయి. అవి బట్టబయలు అయిన రోజు మొత్తం వ్యవహారమే ఆగిపోతుంది. వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చడంతో పాటు ఖర్చు తగ్గించడం మేం ఎంచుకున్నాం. మీ చేష్టల వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలు, రాజధాని లేదనే పరిస్థితి రాకూడదనే మేం తీసుకున్న నిర్ణయం చట్టరూపంలో వచ్చింది.
*5 ఏళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే:*
అంచనా లక్ష కోట్లంటారు. ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.5 వేల కోట్లే:
2018లో వారి ఈనాడులోనే వచ్చిన వ్యాసం ప్రకారం 53 వేల ఎకరాలకు మౌలిక వసతుల కల్పనకు 1.09 లక్షల కోట్లు అవసరమని, కనీసం ఎకరాకు 2 కోట్లయినా ఖర్చు అవుతుందని ఆనాడు రాశారు. ఈ లెక్కన చూస్తే ఈయన ఐదేళ్లలో ఖర్చు చేసింది 5 వేల కోట్లు మాత్రమే. అందులో 2 వేల కోట్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. కేంద్రం, హెచ్డీఎఫ్సీ వారిచ్చిన లోన్లు కూడా అందులో ఉన్నాయి. ఈయన సగం సగం రోడ్లు వేసి, తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్ మాత్రం కట్టాడు.
తెలంగాణాలో సెక్రటేరియట్ ఇప్పుడు 600 కోట్లు ఖర్చు చేసి అద్భుతమైన మహా సౌదం కడితే..అప్పట్లోనే వర్షం పడి కారే బిల్డింగ్ కోసం 600 కోట్లు ఖర్చు చేశాడు. ఆ డబ్బంతా ఎక్కడకు వెళ్లింది? దానికి భూములు ఇవ్వడం నుంచి కన్సల్టెంట్లు, కాంట్రాక్టుల నుంచి దోచుకున్నారు
మోడీగారు అన్నట్లు ఏటీఎం అన్నట్లు చంద్రబాబుకు ఇది కూడా ఏటీఎంలా పనిచేసింది.
*నిర్మాణంలో బాబు ఫెయిల్:*
ఆ కలను భగ్నం చేసి జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రానికి మేలు చేశారు
నిజంగా అలానే నడిపితే లక్ష కోట్లు పెట్టాల్సి వస్తే...వడ్డీలంతా కలిపితే ఐదారు లక్షల కోట్లు అయ్యేది. దానికి ఇరవై, ముపై ్ప ఏళ్లు పట్టేది
గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే తప్పకుండా చాలా సమయం తీసుకుంటుంది
ల్యాండ్పూలింగ్ పెట్టి ముందే రేటును నిర్ణయించి..సామాన్యుడు అక్కడ ఉండేలా కాకుండా చేశావు. అమరావతి నిర్మాణంలో ఫెయిల్ అయ్యాను అనే దుగ్ధ చంద్రబాబు మాటల్లో కనిపిస్తోంది.
*ఇప్పుడు నిజమైన అభివృద్ధి:*
అమరావతి ప్రాంతం అభివృద్ది ఇప్పుడు మా హయాంలో జరుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి ఖాజా వద్ద కలిసే రోడ్డు పూర్తి కావస్తోంది. రింగ్ రోడ్డు పేరుతో వంద కిలోమీటర్ల ఆవల తీసుకున్న దాన్ని ఇబ్బంది లేకుండా వేగంగా పనులు జరుగుతున్నాయి. కరకట్టను ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు..ఆ పనులూ ఇప్పుడు జరుగుతున్నాయి
కేంద్రీకృతమైన అభివృద్ధి వల్ల ఎంత నష్టం జరుగుతుందో గుర్తించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్. అమరావతి ఏ విధంగా అభివృద్ధి కావాలో కూడా చేస్తున్నాం. విజయవాడ–గుంటూరులను కలుపుతూ నిజమైన అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చూపిస్తుంది.
మీ బతుక్కి విజయవాడ ఫ్లై ఓవర్ ఒకటి పూర్తి చేయలేకపోయారు
మళ్లీ చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మీరు మొదలు పెట్టి పూర్తి చేయలేని ఫ్లై ఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లై ఓవర్ పూర్తిగా మా హయాంలోనే పూర్తి చేశాం. రింగ్ రోడ్డు కూడా మా హయాంలోనే పూర్తవుతుంది
*సామాన్యులకూ అందుబాటులో..:*
అమరావతి విషయంలో మీరు ఎంత గగ్గోలు పెట్టినా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. దాన్ని కాదనడానికి ఏమీ లేదు. ఆనాడు నువ్వు అమరావతి అన్నప్పుడు నీలా జగన్మోహన్రెడ్డి గారు యాగీ చేయలేదు. జనం అంతా రాజధానిలో బతికేట్లు ఉండాలని చెప్పారు
అద్దెకు ఇళ్లు దొరక్క ఉద్యోగులు సైతం ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. శివరామకృష్ణన్ కమిటీ కాసేపు పక్కన పెడదాం.. నువ్వేసిన నారాయణ కమిటీ అన్నా ప్రజలను సంప్రదించిందా..? నువ్వు చేసిన దాన్ని చరిత్ర క్షమించలేదు...అందుకే రాష్ట్ర ప్రజలు అడ్డంగా నిన్ను తిరస్కరించారు. దురాశతో మళ్లీ జనం నెత్తిన పెట్టుకుంటారు అనుకుని ఊతకర్రలతో ప్రయోగం చేస్తున్నాడు.
*మీకు చట్టాలు వర్తించవా?:*
నాకూ, నా కొడుక్కి చట్టాలు వర్తించవు అంటే ఎలా చంద్రబాబూ..?
కందుకూరు దుర్ఘటనకు మీరు కారణం కాకపోతే, డ్రోన్షాట్స్ కోసం వాహనాన్ని ముందుకు జరపకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనలు పెట్టాలన్న ఆలోచన ఎలా వస్తుంది..? ఎక్కడా మిమ్మల్ని మీటింగ్ పెట్టుకోవద్దంటే..దాన్ని భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం అంటే సరే. లక్షణంగా పక్కన గ్రౌండ్లో పెట్టుకో...కావాల్సినంత సేపు మాట్లాడుకో. నడిరోడ్డుపై స్టూల్ వేసుకుని, మిద్దెలెక్కి మాట్లాడతాను అంటే చట్టాన్ని ఉల్లంఘించడం కాక ఏమవుతుంది..?
మేం ఎక్కడైనా మాట్లాడతాం..ఏమైనా చేస్తాం...నాకు నా కొడుక్కి చట్టాలు వర్తించవు అని స్టేట్ మెంట్ అన్నా ఇవ్వండి. పిచ్చెక్కి ఉన్మాదంతో కొట్టుకునే వారు అయితే తప్ప ఇలా అడ్డగోలుగా చాలెంజ్లు చేయరు. అలా చేయోద్దు అంటే ఇలానే చేస్తాను ఏం చేస్తావ్ అనే ధోరణి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది
*అందుకే ముందస్తు జపం:*
ముందస్తు ఎన్నికలకు వెళ్లే అలోచన లేదు. ఆ అవసరం ఏముంది అని మేం చెప్తూనే ఉన్నాం. మాకు ఆఖరు రోజు వరకూ ప్రజలకు సేవ చేయడం అవసరం అని మేమంటున్నాం. వాళ్లకి వాళ్లే పల్లె నిద్ర అని రాశారు.. జగన్ గారి ప్రోగ్రాంలు కూడా వారే నిర్ణయిస్తున్నారు. ముందస్తు ఎన్నికల కోసమే పల్లె నిద్ర అంటున్నారు..అసలు పల్లెనిద్ర అనేది చెప్పాల్సింది మేం కదా..?
పైశాచిక ఉన్మాద స్థాయి ప్రచారం ఇది...ఇది మంచి పద్దతి కాదు
ప్రజలు గమనించాలి...వీళ్లు చేసే అరాచకాలు గమనించండి. ఆ రోజు ఏం చేసుకోవాలో చెప్పుకోలేని వాడు రేపు ఏం చేస్తాడో చెప్పడానికి భయపడతాడు. అందుకే వారిలో తత్తరపాటు..ఒక రోజు వాలంటీర్లు తీసేస్తాం అంటారు..రెండో రోజు ఎక్కడ దెబ్బకొడుతుందో అంటూ లేదు లేదు అంటారు. సచివాలయాలు లేవంటారు...మళ్లీ బాగా చేస్తాం అంటారు. అప్పుడేమో అదానీని బయటకు పంపారు అని తాటికాయంత అక్షరాలతో వీళ్లే రాశారు. ఇప్పుడు అదానీకే అన్నీ కట్టబెడుతున్నారు అంటూ రాతలు రాస్తున్నారు.
*ఏ స్థాయికి దిగజారావ్ చంద్రబాబూ...?*
ఆ విమానంలో చంద్రబాబుతో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి ఎవరో మాకైతే తెలియదు. ఆ స్థాయి వ్యక్తి వద్ద ఒక కుర్రాడు ఆ స్థాయిలో ఉపన్యాసం ఇస్తూ సెల్ఫీ తీస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా..? ఈయన చివరికి ఆ స్థాయికి దిగజారిపోయి సెల్ఫీలో పళ్లు ఇకిలిస్తున్నాడు. కొడుకు మొన్న ఇసుకేస్తే రాలనంత జనం అంటాడు...పెద్ద పెద్ద బండరాళ్లు వేసినా ఏమీ కాని రీతిలో తక్కువగా జనం ఉన్నారు.
ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి...ఏడాది దాక ఆగలేక..జనం తమ వెంట వస్తారో లేదో తెలియక వాళ్లకి వాళ్లే ముందస్తు అంటూ ప్రచారం చేస్తున్నారు.
*ఆ ఉద్దేశం మాకు లేదు:*
రాజధాని విషయంలో మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు, మా ప్రభుత్వం స్పష్టంగా వికేంద్రీకరణ తథ్యం..మూడు రాజధానులు తథ్యం
కోర్టును కన్విన్స్ చేసుకుంటాం. ప్రజల మన్ననలు పొందుతాం. పారదర్శకంగా వెళ్తాం. ఎవర్నీ బ్రమల్లో పెట్టే ఉద్దేశం లేదు. వీళ్ల మాటలు నమ్మొద్దు. మా అమరావతి శాశ్వితం అని చెప్పుకోడానికి వీరు పడుతున్న పాట్లు ఇవి. చారిత్రాత్మక అమరావతి చరిత్రలో నిలిచిపోయింది. ఈ అమరావతి కాదు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా జగన్మోహన్రెడ్డి గారు తలపెట్టిన వికేంద్రీకరణ జరగడం తథ్యం
*అందుకు మీ స్థాయి చాలదు:*
జగన్మోహన్రెడ్డి గారిని దించాలంటే ప్రజలకు సేవచేసే దాంట్లో పోటీ పడాలి. రాత్రికి రాత్రి పసుపు కుంకుమ లాంటి తాయిలాలు ఇస్తే జరిగేది కాదు. జగన్ గారు ఒక బెంచ్ మార్క్ పెట్టారు...దానికి తగినట్లు ప్రిపేర్ కాకుండా ఎవరూ ఆయన్ను తట్టుకోలేరు. ఐదేళ్లు పూర్తి చేసుకుని మళ్లీ ఆశీస్సులు కోరి వెళ్తాం..మళ్లీ 2029 వరకూ మేమే ఉంటాం.
ఇప్పుడు వికేంద్రీకరణ పూర్తిగా అందేలా చర్యలు తీసుకుని కింది వరకూ వెళ్లేలా కృషి చేస్తాం. నిజమైన రీతిలో అన్ని వర్గాలకూ ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది. ఈ ఫలాలను అట్టడుగు వర్గా ప్రజలు అందుకున్నప్పుడు దాని ప్రతిఫలం ఏమిటో రానున్న రోజుల్లో తెలుస్తుంది
ఎన్నికలు త్వరలో వస్తున్నాయంటే నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను నిలబెట్టుకునేందుకే.
*ఆనాడు చిల్లర కాంట్రాక్టర్లా..:*
చంద్రబాబు ఆనాడు చిల్లర కాంట్రాక్టరులా వ్యవహరించాడు. ఆనాడు చంద్రబాబు పోలవరం పూర్తి చేసి ఉంటే బాగుండేది. ఆ రోజు నిద్రపోతున్నాడా..? కాంట్రాక్టుల కోసం ఓ చిల్లర కాంట్రాక్టరులా ప్రవర్తించి ఆలస్యం చేశాడు. మోడీ గారు అన్నట్లు పోలవరం వారికి ఏటీఎంలా పని చేసింది. ఇప్పుడు అది ఊపందుకుంది...ఆయన చేసిన తప్పువల్ల ఇబ్బంది వస్తోంది. చరిత్రలో వెనక్కి తిరిగి చూసుకుంటే పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు అనే కన్పిస్తుంది
మేం కూడా వైజాగ్ వెళ్తున్నాం...మీరు కూడా రండి అని ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక వేత్తలతో కోరారు. అందులో తప్పేమీ లేదు..ఇప్పటికీ అదే చెప్తాం
*అది అలా ఉందంటే మావల్లే:*
ప్రత్యేక హోదాపై ఆయనకంటే బాగా మేం ఎలా పోరాడుతున్నామో ప్రజలందరికీ తెలుసు. హోదా అనే అంశం ఈ రోజుకీ సజీవంగా ఉందంటే దానికి కారణం మా పోరాటమే. అవసరమైన రాజకీయ పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. చంద్రబాబుకు ఆ అవకాశం వచ్చింది..కానీ దాన్ని వినియోగించుకోలేకపోయాడు. రాజకీయంగా మేం కేంద్రంతో కలిసి లేము...ప్రభుత్వాల పరంగా సహకారం ఉంది. హోదా కోసం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది.