తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే అని వైయస్ఆర్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని, ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ఆయన సూచించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్ ఇంఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సజ్జల మాట్లాడారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలన కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను పూర్తిగా నాశనం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను వారికి అందకుండా చేశారు. డెలివరీ మెకానిజంను కూకటివేళ్లతో పెకిలించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ నేపధ్యంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా... ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో అన్ వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. వీటిపై చేపట్టబోయే కార్యక్రమాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 13, డిసెంబరు 27, జనవరి 3 వ తేదీలలో మూడు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని నిర్ణయించింది. తొలుత డిసెంబరు 11న అనుకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపధ్యంలో దాన్ని డిసెంబరు 13 మార్చాం. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల భారం ప్రజలపై మోపింది. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... పెంచిన కరెంటు ఛార్జీలపై ర్యాలీ చేపట్టనున్నాం. అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్న నేపధ్యంలో వారికి అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ గట్టిగా తీర్మానం చేసింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. డిసెంబరు 13న రైతుల తరపున పోరాడుతూ, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందన్న విషయం ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలి. పార్టీ అంతా కలిసికట్టుగా చేపడుతున్న ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రేపు జిల్లా అధ్యక్షులు ఆయా జిల్లాల్లో మీడియాతో మాట్లాడి కార్యక్రమాల వివరాలు తెలియజేయాలి. అందులో ఏయే అంశాలపై ఆందోళన చేస్తున్నాం.. జిల్లా కలెక్టర్లకు ఏయే అంశాలపై వినతిపత్రం ఇవ్వబోతున్నాం అన్న అంశాలను తెలియజేయాలి. అదే విధంగా ర్యాలీ మార్గంతో పాటు ఎక్కడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడతామో దాన్ని ముందే పరిశీలించి... అది కూడా చెప్పాలి. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి.