పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హా ఏర్పాటుకు చందాలు వ‌సూలు దారుణం

ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ నేతలు

తాడేప‌ల్లి:  అమ‌రజీవి పొట్టి శ్రీ‌రాములు విగ్రహా ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్యవైశ్యుల దగ్గర చందాలు వసూలు చేయడం దారుణమ‌ని  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ‌మే పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.  తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ఏమన్నారంటే...

లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

శ్రీ పొట్టిశ్రీరాములు  మనకంతా ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన ఆమరణ నిరాహారదీక్షను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప మహనీయుడు. ఆయన స్పూర్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకుంది. నాడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు సీఎంగా ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు, జగన్‌ గారు సీఎం అయిన తర్వాత ఆ మహానుభావుడి సేవలు భావితరాలకు గుర్తుండాలని ఆంధ్ర రాష్ట్ర అవతరణను తిరిగి నవంబర్‌ 1న జరపాలని నిర్ణయించి ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పొట్టిశ్రీరాములు గారి స్పూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి

పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పక్కనపెట్టింది. కానీ ఆ తర్వాత జగన్‌ గారు సీఎం అయిన తర్వాత నవంబర్‌ 1న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం పొట్టిశ్రీరాములు గారిని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చింది. నారా లోకేష్‌ ఇటీవల మీటింగ్‌ పెట్టి మా ప్రభుత్వం 6 ఎకరాల స్ధలం ఇస్తుందని గొప్పగా చెప్పారు కానీ ఆయన పేరు చెప్పి టీడీపీ నేతలు చందాలు వసూలు చేసి విగ్రహం పెడతామంటున్నారు. ఎక్కడైనా మహానుభావుడి విగ్రహం ఏర్పాటుకు చందాలు వసూలు చేయడం చూశామా, అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు డీపీఆర్‌కు రూ.11 కోట్లు ఖర్చుపెడతారా, కానీ పొట్టిశ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటుకు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరి చందాలతో కట్టాలని చంద్రబాబు, లోకేష్‌ చెబుతున్నారు. పొట్టిశ్రీరాములు గారి మీద ఇదేనా కూటమి ప్రభుత్వానికి ప్రేమ అని ప్రశ్నిస్తున్నాం. లోకేష్‌ గారు మీ వసూళ్ళకు ఆయన పేరు కావాలా, కూటమి ప్రభుత్వం ఆ మహానుభావుడిని అవమానించింది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే పొట్టిశ్రీరాములు గారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయాలి. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎంప్లాయిస్ వింగ్ ప్రెసిడెంట్ నలమూరు చంద్రశేఖర్ రెడ్డి, కొమ్మూరి కనకారావు, నారాయణ మూర్తి, పద్మజ, అంజిరెడ్డి, షరీఫ్‌ ఇతర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top