వైయస్ఆర్ జిల్లా: కడపలో టీడీపీ నిర్వహించింది మహానాడు కాదు..చంద్రబాబు, లోకేష్(అబ్బా కొడుకులు) డబ్బా నాడు అని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఎద్దేవా చేశారు. మహానాడు నిర్వహణపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ` మోసాలకు, కుట్రలకు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత మహానేత వైయస్ ది. ప్రజల గుండెల్లో మహానేతలుగా దివంగత ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారు..తర్వాత ఆ ఘనత సాధించిన నాయకుడు వైయస్ జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి కార్యక్రమం గుర్తు వస్తుందా...? సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైన అమలు చేశారా? మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను బయపెట్టి , బెదిరించి తరలించారు. మహానాడు కాదు.. అబ్బా కొడుకుల డబ్బా నాడు. వైయస్ జగన్ భజన తప్ప ప్రజలకు మంచి చేశాం అని ఎక్కడా చెప్పలేదు. కొత్తగా సూపర్ సిక్స్ పేరు మార్చి ఆరు శాసనాలు అంటూ కట్టు కథలు చెప్పారు. వైయస్ జగన్ పై దుష్ప్రచారం తప్ప మహానాడు వల్ల ఒరిగింది ఏం లేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వైయస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీ లు జరుగుతాయి. స్థానికంగా అధికారులకు ప్రభుత్వం నెరవేర్చని పథకాల అమలుపై డిమాండ్ పత్రాలు అందజేస్తాం` అని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు.