తాడేపల్లి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ తీరు దారుణం: సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. కాన్ఫరెన్స్లో నేతలు ఏం చెప్పారంటే..: – సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోంది. – ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. – కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. – ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. - పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. – జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. – కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారు. – వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోంది. – అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయించినట్లు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి.