అధిక వ‌డ్డీల‌కు అప్పులా?

ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుంది బాబూ? 

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేదు

అప్పుల కోసం అడ్డ‌గోలుగా రాజ్యాంగ ఉల్లంఘ‌న‌

గ‌తంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘ‌న‌ల‌పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది

అయిన‌ప్ప‌టికీ ఏపీఎండీసీ ద్వారా మ‌ళ్లీ అప్పులు చేశారు

ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ప్రైవేట్ వ్య‌క్తులు నిధులు డ్రా చేసుకోవ‌డానికి వీల్లేదు

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం

తాడేప‌ల్లి:  అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకురావ‌డం ద్వారా ఏపీఎండీసీపై ఏడాదికి రూ.235 కోట్ల అధ‌న‌పు భారం ప‌డుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ  డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెళ్తుందో చంద్ర‌బాబు చెప్పాల‌ని సూటిగా ప్ర‌శ్నించారు.  వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఐదేళ్ల‌లో చేసిన  అప్పుల్లో సగం చంద్ర‌బాబు ఏడాదిలోనే చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.  ఏపీలో చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేయడంపై వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేసి రూ. 5,526 కోట్లు అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. ఏపీ స‌ర్కార్ అప్పుల‌పై వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ స్పందించారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
 ‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. చంద్రబాబు సర్కార్ అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ. 5,526 కోట్లను బాండ్ల జారీ  ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా APMDCపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి?. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క​ ఏడాదిలోనే చేశారు’ అని చెప్పారు.

Back to Top