స్టాంపు డ్యూటీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలి

దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలి

మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య.

స్టాంప్‌ డ్యూటీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యేనే

ఇది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చేసిన అక్రమం

తన దళారి ‘మీ–సేవ’ బాబుపై నింద వేసిన ఎమ్మెల్యే

అలా తాను నిర్దోషి అని చెప్పుకునేందుకు ఎమ్మెల్యే కుట్ర

మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టీకరణ

‘మీసేవ’ బాబు ఎక్కడున్నాడో పోలీసులు చెప్పడం లేదు

ఈ కేసులో బాబుతో సహా, నలుగురిని అరెస్ట్‌ చేశారు

5 రోజులైనా వారిని ఇంకా కోర్టులో హాజరుపరచలేదు

వారిని వెంటనే మెజిస్ట్రేట్‌ ఎదుటకు తీసుకు రావాలి

లేకపోతే హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేస్తా

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ ఎంపీ తలారి రంగయ్య

తాడేపల్లి: బ్యాంక్‌ రుణాల కోసం ఈ–స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్‌ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్‌ చేశారు. తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్‌ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. 
 
మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:
 
‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:
    కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్‌ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్‌ కంపెనీకి బ్యాంక్‌ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్‌ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్‌ల స్కామ్‌లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్‌ వెలుగు చూసింది. 
    ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్‌ ‘మీ–సేవ బాబు’.  ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్‌ ఎందుకు తీసుకుంటాడు?  

ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:
    42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం? ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్‌ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. 

సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?:
    ‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.

ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:
    స్టాంప్‌ డ్యూటీ స్కామ్‌కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక  ప్రకటన చేయాలి. 

‘సిట్‌’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:
    కళ్యాణదుర్గంలో స్టాంప్‌ డ్యూటీ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్‌’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.

హైకోర్టు తలుపు తడుతా:
    పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్‌ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్‌లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు.

Back to Top