వెలగపూడి: అవినీతి రహిత పరిపాలన అందించడమే ధ్యేయం. అవినీతిని నిర్మూలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవినీతికి అడ్డుకట్ట వేయగలిగితే.. దేశంలోనే కాదూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తాం. గత ప్రభుత్వ హయాంలో గ్రామస్ధాయి వరకు అవినీతి పాకింది... గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకు ఉన్న అవినీతి నిర్మూలిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా.. పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాలన్నీ చూశాను.. విన్నాను. నేను ప్రజలకు ఏం చెప్పానో.. అది మనస్ఫూర్తిగా అమలు చేస్తానని సీఎం అన్నారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం పూర్తి పాఠం..
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో చంద్రబాబు సూటిగా తన గుండెలపై చేతులు వేసుకొని తన మనసాక్షిని అడగాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014 జూన్ 7న, ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విడిపోయిన రాష్ట్రానికి హోదా ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆదేశాలు అమలు చేయమని ప్లానింగ్ కమిషన్కు ఇచ్చారు. ఏడు నెలల పాటు చంద్రబాబు కేవలం ప్లానింగ్ కమిషన్కు వెళ్లి అమలుకు నోచుకోవాల్సిన ఆర్డర్ను అడిగితే సరిపోయేది. చంద్రబాబు ఒక్క రోజు కూడా ప్లానింగ్ కమిషన్ను అడగలేదు. ప్రత్యేక హోదా కోసం 1.08.2015న అసెంబ్లీలో తీర్మానం చేశారు. నీతి అయోగ్ వచ్చిన తొమ్మిది నెలల తరువాత స్పందించారు. చంద్రబాబు అడిగి ఉంటే ఇవాళ్టికి ప్రత్యేక హోదా వచ్చేది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.
- చంద్రబాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్లుగా ఉంది. చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ను అడిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఈయన మళ్లీ ప్రధాన వద్దకు వెళ్లి అడగడం ఆశ్చర్యంగా ఉంది. అదే కేబినెట్లో ఈయనకు సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. పోలవరంకు సంబంధించిన ఏడు మండలాలు ఇవ్వకపోతే ఈయన ప్రమాణ స్వీకారం చేయనన్నారు. మరీ ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, సత్యదూరమైన అబద్ధాలు. టీడీపీ నేతల ప్రవర్తనా తీరు చూస్తే ఏమాత్రం మార్పు లేదు. ఈ సారి 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలు రేపు ఇన్ని కూడా రావు.
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ..ప్రజలు ఇచ్చిన అధికారంతో ఈ ప్రజాస్వామ్య దేవాలయంలోకి అడుగుపెట్టాం. ఇక మీదట రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా ఈ సభను నడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాం అధ్యక్షా..చంద్రబాబు ప్రభుత్వంలో మాకు మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. నీతిమంతమైన పాలన అందించాలన్నదే మా ధ్యేయం. పైన దేవుడు, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ఇది. అందుకే మేం ఈ సభలో అడుగుపెట్టాం. వచ్చే ఐదేళ్లు కూడా దేవుడి ఆశీస్సులతో ప్రజల కోసం పని చేస్తున్నాం.
- చెడిపోయిన ఈ రాజకీయ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పని చేస్తున్నాం. పాదయాత్రలో ఏం చెప్పామో చిత్తశుద్దిగా అదే చేస్తాం. ఈ మూడు వారాల పాటు జరిగిన పాలన కూడా ఇదే మాదిరిగానే ఉంది. గ్రామం నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఇసుక, మట్టి, రేషన్కార్డు, ఇల్లు, కుల సర్టిఫికేట్, బర్త్, డెత్, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము..చివరకు మరుగుదొడ్డితో సహా లంచాలతో దోచుకుంటూ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఈ వ్యవస్థను పై నుంచి కింది దాకా పూర్తిగా మార్చాలన్న నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాం. నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో నేను అడిగింది కూడా ఇదే..ఒక్క అవకాశం ఇవ్వండి..ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చుతానని ప్రజలను అడిగాను. దేవుడు ఆశీర్వదించారు. ప్రజలు మాకు 50 శాతం ఓట్లు వేసి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే నా లక్ష్యం. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. దేశమంతా మన ౖÐð పు చూసేలా పారదర్శకమైన పాలన అందిస్తాం. జడ్జిని ఇవ్వమని కోరాం. టెండర్లు నేరుగా జడ్జికే ఇస్తాం. మాకు వ్యతిరేకులైన మనసులైన కూడా వారు ఇచ్చే సలహాలు తీసుకోండి. ఆ జడ్జి గారు తన వద్ద ఉన్న టెక్నికల్ టీమ్ ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుంది. జడ్జి సూచించిన సలహాలు పాటిస్తాం. టెండర్లకు ముందే సలహాలు తీసుకుంటాం. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇరిగేషన్ నుంచి ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడానికి సన్నహాలు చేస్తున్నాం. ప్రతి వర్క్ మీదు అధ్యాయనం జరుగుతుంది. అంచనాలు ఎలా పెంచాలో ఆ ఇంజినీర్లు తేల్చుతారు.
- రివర్స్ టెండరింగ్ ద్వారా ఆ వర్క్ను మార్చుతాం. ఎక్కువ మంది టెండరింగ్లో పాల్గొనే విధంగా పారదర్శకంగా మార్చుతాం. ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, మంత్రులు ఎవరైనా సరే ..వీరందరు కూడా ప్రజా సేవకులే. అవినీతిని మాత్రం సహించేది లేదు. నీతివంతమైన పాలన అందిస్తేనే పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. అవినీతిని అంతం చేస్తే అభివృద్ధి సాథ్యమవుతుంది. రోల్ మాడల్గా నిలుస్తాం. మనకు 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. రోడ్లు ఉన్నాయి. ఇందులో అవినీతికి అడ్డుకట్ట వేస్తే అభివృద్ధి మన కళ్ల ముందే కనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీకి 250 సీట్లు వచ్చి ఉంటే మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఇవాళ వాళ్లకు ఫుల్ మెజారిటీ వచ్చింది. వాళ్లు ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. హోదా వచ్చే వరకు పోరాటం చేస్తాం. నా పాదయాత్రలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం పడే కష్టాలను చూశాను. అన్ని కూడా దగ్గర నుంచి చూశాను. వీరి కష్టాలను మార్చాలన్నదే నా తపన. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఏం కోరుకుంటాన్నారో నేను విన్నాను. మంచి చేస్తాను. నవరత్నాలతో పేదవారికి మంచి చేయాలని ఆరాట పడుతున్నాను. అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా జీవించగలిగితే నాకు ముఖ్యమంత్రిగా సంతృప్తికరంగా ఉంటుంది. 40 ఏళ్లు అనుభవం ఉన్న వారు మాట్లాడుతున్న మాటలు చూశాం. సామాజిక న్యాయం చేస్తాం. మంత్రి మండలి ఏర్పాటులోనే 13 సామాజిక వర్గాలకు చోటు కల్పించాం. నామినేటేడ్ వర్క్స్లోనే సామాజిక న్యాయం చూపుతాం. నా సొంత సామాజిక వర్గాన్ని తగ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వాట ఇచ్చి ఒక విప్లవానికి స్వీకారం చుట్టాను. నామినేటేడ్ పదవుల్లోనే కాదు..నవరత్నాల ద్వారా సామాజిక, ఆర్థిక న్యాయం చేస్తాం. ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేస్తాం. ఏ మనిషి వైద్యం అందక చనిపోకూడదన్నదే లక్ష్యంగా వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. ఓటు రాజకీయాలు చేయం. మేనిఫెస్టో అంటే వందల పేజీల పుస్తకాలు పెట్టకుండా, కేవలం రెండే రెండు పేజీలతో మా మేనిఫెస్టో రూపొందించాం. అది ఎప్పుడు కనిపించే విధంగా రూపొందించాం. నా చాంబర్లో కూడా నా మేనిఫెస్టో కనిపించేలా ఏర్పాటు చేశాం. మంత్రులు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నారు. మేనిఫెస్టో అన్నది చెత్త బుట్టలో పడేసే కార్యక్రమం మాదిరిగా కాకుండా ఒక బైబిల్, ఖురాన్, భగవత్గీత మాదిరిగా భావిస్తాం.
- ప్రతి రైతుకు తోడు ఉండేందుకు రైతు భరోసా పథకం ఏర్పాటు చేస్తున్నాం. చెప్పినదానికంటే ముందుగానే ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఏటా రూ.12,500 చొప్పున రైతులకు ఇస్తాం. బోర్ వేసేందుకు నియోజకవర్గానికి ఒక రిగ్గు ఏర్పాటు చేస్తాం. సున్నా వడ్డీ పథకం అమలు చేస్తాం. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. రైతులకు, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. చంద్రబాబు పాలన నుంచి మళ్లీ రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తాం. రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా చేస్తాం. రైతులకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది. కరువు,వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. ఇన్ఫుట్ సబ్సిడీలను చంద్రబాబు చెల్లించలేకపోయారు. పెండింగ్ ఇన్ఫుట్ సబ్సిడీ విడుదల చేస్తూ సంతకాలు పెట్టాను. రైతులకు ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితి రాకుండా రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.
- ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గత ప్రభుత్వం ఈ పాఠశాలలను గొప్పగా నడపాలని ఏ రోజు ఆలోచన చేయలేదు. సెప్టెంబర్ దాటినా కూడా పుస్తకాలు అందించలేదు. మధ్యాహ్న భోజనం పథకంలో సరుకుల కొనుగోలు చేసే బిల్లులు పెండింగ్లో పెట్టారు. విద్యార్థులకు యూనిఫాం ఇవ్వని పరిస్థితి ఉండేది. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం మరుగుదొడ్లు కూడానిర్మించలేదు. ఈ పాఠశాలల రూపు రేఖలు మార్చుతాం. రెండేళ్లలోపే స్కూళ్లను మార్చిచూపుతాం. అన్ని కూడా సమకూర్చుతాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంగా మార్చుతాం. తెలుగు సబ్జెక్ట్ కచ్చితంగా అమలు చేస్తాం. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచేందుకు బడ్జెట్ పెంచుతాం. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలోనూ పేదలకు 25 శాతం ఉచితంగా సీట్లు కేటాయించాలి. ఏ ఒక్క స్కూల్లో కూడా జరగలేదు. విద్యా హక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం ఇచ్చేలా చూస్తాం. స్కూళ్లకు, కాలేజీలకు వేరు వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తాం. ఫీజులు తగ్గించి, పేదలకు భారం లేకుండా ఫీజులు తగ్గిస్తాం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తెస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 33 శాతం మందికి చదువు రావడం లేదు. దేశంలో యావరేజ్ 26 శాతం. దేశం కంటే మనమే వెనుకబడ్డాం. అమ్మ ఒడి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతాం. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేస్తాం. పిల్లలను బడికి పంపించిన తల్లికి ఏటా రూ.15 వేలు చెల్లిస్తాం.
- నాలుగు నెలల క్రితం వరకు కూడా అవ్వ, తాతలకు పింఛన్ రూ.1000 ఇచ్చేవారు. ఓట్ల కోసం చంద్రబాబు రూ.1000 పెంచారు. అది కూడా నేను పాదయాత్రలో పింఛన్ రూ.2వేలు ఇస్తామంటే ఆ మాత్రం పెంచారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2250 పెంచుతూ సంతకం చేశాను. ప్రతి ఏటా రూ.250 పెంచుతూ..పింఛన్ రూ.3 వేలు చేస్తాం.
- అంగన్వాడీలకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ రోజు కూడా రాలేదు. తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ ఇస్తామన్న హామీని నెరవేర్చుతూ వారి జీతాలు పెంచాం. డ్వాక్రా యానిమేటర్లకు రూ.10 వేలు పెంచాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం పెంచాం. పారిశుద్ధ కార్మికులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. వారి కాళ్లు మొక్కాలి. అలాంటి వారిని తీసేసే కార్యక్రమం గత ప్రభుత్వాలు చేశాయి. పారిశుద్ధ కార్మికులకు మేలు చేసే దిశగా వారి వేతనాలు రూ.18 వేలకు పెంచాం.
- ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని మాట ఇచ్చాం. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. అవుట్ సోర్సింగ్లో పని చేసే వారికి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. ఎలక్ట్రసిటీ మీటర్లు బిల్లింగ్ కోసం అవుట్ సోర్సింగ్కు ఇస్తే వారు..వినియోగదారుల నుంచి రూ.1 వసూలు చేస్తే కార్మికులకు సగం కూడా ఇవ్వడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాగోగుల కోసం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చేది నేరుగా ఆ ఉద్యోగులకు చేరేలా ఆదేశాలు జారీ చేశాం.
- ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే వైద్యం ఖర్చు వేయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లించని పరిస్థితి ఉంది. 108, 104 వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 350 కొత్త 108 అంబులెన్స్లు కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. 650 కొత్త 104 అంబులెన్స్లు కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చాం. మెడికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశాం. నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా మార్చితే ప్రజలకు మంచి చేస్తామన్నది ఆకమిటీకి సూచించాం. ఆరోగ్యశ్రీ వైద్యం విషయంలో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తాం.
- దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇదే ఏడాది ఉగాది నాటికి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం.
- అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అక్షరాల 9 లక్షల మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం.
- అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తూ అడుగులు వేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి వ్యవస్థలో మార్పు తెస్తాం. లబ్ధిదారుడికి మంచి జరిగేందుకు చర్యలు తీసుకున్నాం. గ్రామ సెక్రటేరియట్కు ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గర్వంగా చెబుతున్నాను. అగస్టు 15 నుంచి ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్లుగా నియమిస్తాం. వారికి రూ.5 వేల గౌరవవేతనం ఇస్తాం. అవినీతి ఎక్కడా లేకుండా ప్రభుత్వ పథకాలు డోర్ డెలీవరీ చేస్తాం. వాలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు రూ.5 వేలు వేతనం ఇస్తున్నాం.
- చౌక దుకాణాల నుంచి ఇస్తున్న బియ్యంను మార్చుతాం. మనం తినే బియ్యాన్నే పేదలకు ఇస్తున్నాం. ఆ బియ్యాన్ని 5, 10, 15 కేజీల చొప్పున ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తాం. వేలిముద్రలు పడటం లేదని ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండం. అందరికి అందజేస్తాం.
- రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేపట్టాం. ఎక్కడా కూడా అవినీతి, అన్యాయం జరుగకుండా ఉండేందుకు ఆదేశాలు ఇస్తున్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగిందని ఫోన్ చేస్తే ఆ గ్రామ వాలంటీర్ను తొలగిస్తాం. కులం, మతం, ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందజేస్తాం.
- ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులకు మాటిస్తు ఐఆర్ 27 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశాం. సీపీఎస్ రద్దు చేస్తామని మాట చెప్పాం. సీపీఎస్ రద్దు చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేశాం.
- నవరత్నాల అమలు మా ప్రభుత్వ అజెండా..ఇదే మాట నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించాం. వినమ్రంగా చెబుతున్నాను. మాకు ఓటు వేయని ప్రజలు కూడా నిండు మనసుతో దీవించాలని కోరుతున్నాను. అవినీతి చేసిన వారికి కచ్చితంగా శిక్ష తప్పదు. పేదలు పేదలుగా ఉండటానికి వీలు లేదు. చదువుకునే డబ్బు అడ్డుకాకూడదు. సమానత్వం అందకుండా ఉండటానికి వీలు లేదు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాను కూడా సహకరించాలని కోరుతున్నాను. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అని స్పష్టం చేస్తున్నాను. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా...
|
|
|