విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు, తదితర ప్రాంతాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వికలాంగుల సంక్షేమం కోసం వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ..ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ..“దివ్యాంగులను ప్రతి రంగంలో ప్రోత్సహించడం సమాజం మొత్తం బాధ్యత. అవయవ లోపాన్ని పక్కనపెట్టి స్వశక్తితో ముందుకు సాగాలి,దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటికే వచ్చి పెన్షన్లు అందించిన పద్ధతిని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచామని అబద్ధాలు చెబుతోందని, ‘సదరన్ సర్టిఫికెట్ పర్సెంటేజ్’ పేరుతో దివ్యాంగులకు అనవసర ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. చంద్రబాబు పెన్షన్లు తీసేసి దివ్యాంగుల జీవనోపాధిని కష్టాల్లోకి నెట్టారు” అని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, కృష్ణ జిల్లా అధ్యక్షులు శ్యాముల్, ఏలూరు జిల్లా అధ్యక్షులు షమీమ్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు బద్రి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి , పార్టీ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు అగస్టిన్, గుంటూరు నగర అధ్యక్షురాలు & తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, విజయవాడ పార్లమెంటు ఇంచార్జ్ పోతిన మహేష్, తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ వనమా బాల వజ్రా బాబు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గ అబ్జర్వర్ నిమ్మకాయల రాజనారాయణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షుడు గణేష్, వికలాంగుల విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.