మురికివాడల పునరుద్ధరణకు తరలింపే అవరోధం

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద మురికివాడల పునరాభివృద్ధిలో భాగంగా కాంక్రీటు ఇళ్ల‌ నిర్మాణానికి కేవలం 3.52 శాతం కేటాయింపులే జరిగాయి. ఈ పథకంలోని ఇతర అంశాలతో పోలిస్తే మరికివాడల పునరాభివృద్ధి ఎందుకు వెనుకబడింది అని సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రిని ప్రశ్నించారు. దీనికి మంత్రి హర్దీప్ సింగ్ పూరి జవాబిచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పథకంలో నాలుగు విభాగాల కింద పేదలకు గృహ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ నాలుగు విభాగాలు వాటి డిమాండ్‌కు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాయి. ఇందులో బీఎల్సీ విభాగంలో కొత్తగా పెళ్ల‌యిన దంపతులు సొంత ఇల్లు కావాలనుకుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి గృహ నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. సీఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం మాత్రం చురుగ్గా ముందుకు సాగుతోంది. అందుకు కారణం అది అత్యంత సరళతరమైనది కావడమే. సొంత ఇల్లు కావాలనుకునే యువ దంపతులు ముందుగా ఒక ఇంటిని గుర్తించి దాని కొనుగోలుకు బ్యాంక్‌ రుణం పొందాలి. ఈ రుణంలో ప్రభుత్వం రాయితీ ఇస్తుందని కేంద్ర‌మంత్రి చెప్పారు. ఇక మురికివాడల పునరుద్ధరణ విభాగంలో అక్కడ భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్వాసితులను తాత్కాలికంగా వేరే చోటికి తరలించాల్సి ఉంటుంది. మురికివాడల పునరుద్ధరణకు ఇదే అవరోధంగా మారిందని చెప్పారు. మురికివాడల పునరుద్ధరణ కింద ఇప్పటికే దేశంలో ఇప్పటికే 210 క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.

Back to Top