సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు

వసూలు చేసే మొత్తాలను కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుంది

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ జవాబిచ్చారు. సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో కేంద్ర‌మంత్రి వివరించారు. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914 కోట్లు. అదే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3 లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు కేంద్ర‌మంత్రి వివరించారు. 

ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్‌ 4 శాతంకు మాత్రమే పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385 కోట్లు 2022-23లో  సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని మంత్రి వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్‌ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.

Back to Top