న్యూఢిల్లీ: పర్యాటక రంగానికి రాష్ట్రాలు పరిశ్రమ హోదా కల్పిస్తే అది మరింతగా రాణిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం వైయస్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. పరిశ్రమ హోదా పొందడం ద్వారా పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలు ఇతర పరిశ్రమలతో సమానంగా విద్యుత్ చార్జీలు, ఇతర పన్నుల వంటి ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పర్యాటక రంగం వాణిజ్యం కేటగిరిలో ఉన్నందున అధిక రేట్లను చెల్లించాల్సి వస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పిస్తే భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఆతిధ్య రంగంలో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహకారిగా మారుతుందని అన్నారు.
దేశంలో ఇప్పటికే గుజరాత్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి పదకొండు రాష్ట్రాలు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మిగిలిన ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ పదేపదే సలహా ఇస్తోంది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయిలో జరిగే ఇంటరాక్టివ్ సెషన్స్లోను, సమావేశాలలోను, కరస్పాండెన్స్ ద్వారా వాటిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.