నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి:  తిరుపతి నగర ప్రజలు,  యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నవంబరు నెలలో ముఖ్యమంత్రి  శ్రీ వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్  గిరీష, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనుల పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు వంతెన నిర్మాణ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. దీన్ని  ప్రారంభించ డానికి చర్యలు తీసుకోవాలన్నారు.  టిటిడి నుంచి కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన మొత్తం త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి అధికారులను ఆదేశించారు.  ప్రారంభోత్సవానికి అవసరమైన పనులు నవంబర్ లోపు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను  చైర్మన్ ఆదేశించారు.

అనంతరం చైర్మన్  వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  శ్రీనివాస సేతు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి టిటిడి ని ఆదేశించారన్నారు.  నవంబర్ లోగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు నిర్మాణం పూర్తి అయిన వారధిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు.

Back to Top