హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మే 23 తరువాత కటకటాల వెనక్కే.. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు తీగలాగితే డొంకంతా కదులుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణా ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా పంజాబ్ పౌరుల సమాచారాన్ని కూడా దొంగలించినట్లుగా వెల్లడైందని, పాకిస్థాన్ ఐఎస్ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కేనని హెచ్చరించారు