చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ధర్మం కాదు కదా?

నడిరోడ్డుపై కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?

రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

ప్రభుత్వ తీరుపై వైయస్‌ జగన్‌ ఫైర్‌ 

గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగర్‌లో పర్యటించిన మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడ పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రులు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు

దారుణంగా దిగజారిన పోలీసు వ్యవస్థ

పూర్తిగా అదుపు తప్పుతున్న పరిస్థితులు

పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు

పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యం

వైయస్‌ జగన్‌ ధ్వజం

ఆ యువకులపై ఉన్న పాత కేసులకు..

పోలీసుల దాడికి ఏం సంబ«ంధం?

నేను ఆ యువకులను వెనకేసుకు రావడం లేదు

కానీ, వారిని అలా బహిరంగంగా హింసించడం ఎందుకు?

కేసుల వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయి కదా?

పోలీసులు వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎలా కొడతారు?

పోలీసులు చట్టాన్ని అలా ఎలా ఉల్లంఘిస్తారు?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌ 

ఆ కుటుంబాల్లో మంచి విద్యావంతులున్నారు

ఆ యువకులూ చదువుకున్న వారే

వారికి పెళ్లి కావాల్సిన చెల్లెళ్లూ ఉన్నారు

పోలీసుల చర్య వల్ల ఆ కుటుంబాలకు అప్రతిష్ట

ఓ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగిస్తారా?

ఇప్పుడు ఆ కుటుంబాల పరువు ఎవరు తీసుకొస్తారు?

పోలీసుల తీరు దారుణం. పూర్తిగా అసమంజసం

వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

తెనాలి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీఅధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని, అక్కడ మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌ అన్నారు.

తెనాలిలో మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

అది కళ్లెదుట కనిపిస్తున్న సత్యం:
    రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అనేక సంఘటనలు గమనిస్తే.. ప్రతి సంఘటనలో ఏ రకంగా చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందో కనిపిస్తుంది. తనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిందనడానికి రాష్ట్రంలో ఈరోజు అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం మన కళ్లెదుటే కనిపిస్తున్న సత్యం. 
    ఆ రకంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవడంతో పోలీసు వ్యవస్థ అదుపు తప్పితే ఎలాంటి వికృత రూపం దాల్చుతుందని చెప్పడానికి నిదర్శనం తెనాలిలో జరిగిన ఘటనే సాక్ష్యం. రాష్ట్రంలో ఇంతటి భయానక పరిస్థితుల మధ్య.. అసలు తెనాలిలో ఏం జరిగింది అన్నది తెలుసుకునేందుకు వచ్చాం.

ఇదీ ఆ యువకుల చరిత్ర:
    పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాజేష్‌ అనే పిల్లాడు, మరో పిల్లాడు చేబ్రోలు జాన్‌ విక్టర్, ఇంకో పిల్లాడు కరిముల్లా. వీరు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్‌ అనే పిల్లాడు తెనాలిలో ఉండడు. జూమాటో కంపెనీలో హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. వీళ్లంతా యంగ్‌స్టర్స్‌. చిన్నతనంలో ఏదో పాత గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు. అతన్ని చూడడానికి ఫ్రెండ్‌ వచ్చాడు. అతడు పాలిటెక్నిక్‌ చదివాడు. అతడూ తెనాలిలో ఉండడు. మంగళగిరి నుంచి జాన్‌ విక్టర్‌ వచ్చాడు. అతడు జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో కూడా రిజిస్టర్‌ అయ్యాడు. రాకేష్‌ను చూడడానికి తెనాలి వచ్చిన విక్టర్‌ వెంట, అతడి స్నేహితుడు కరిముల్లా కూడా వచ్చారు. అతడు మెకానిక్‌.

ముందు అసలేం జరిగింది?:
    ఆ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతానగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఒక కానిస్టేబుల్‌ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్‌ విక్టర్‌ బైక్‌తో పాటు, అతడి మొబైల్‌ను సివిల్‌ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ, ప్రశ్నించిన ముగ్గురు, ఆ కానిస్టేబుల్‌ నుంచి బైక్‌ కీ, మొబైల్‌ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్‌ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్‌ విక్టర్‌ మంగళగిరి వెళ్లిపోయారు. ఇది జరిగింది ఏప్రిల్‌ 24న.

ఆ తర్వాతేం జరిగింది?:
    ఆ మర్నాడు, అంటే ఏప్రిల్‌ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్, జూనియర్‌ అడ్వకేట్‌ అయిన జాన్‌ విక్టర్‌తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాజేష్‌ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్‌ పీఎస్‌లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్‌ 26న ముగ్గురిని స్టేషన్‌కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్‌ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ, తెనాలి టూ టౌన్‌ సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు.
(అంటూ ఆ ఫోటోలు. ఆరి అరికాళ్లపై ఏర్పడిన గాయాల ఫోటోలు మీడియాకు చూపారు).


    ఇంకా అంతటితో ఊర్కోకుండా, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్‌ 27న కూడా మరో రోడ్‌ సెంటర్‌కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని తమ అదుపులోనే ఉంచుకోవడమే కాకుండా, విక్టర్‌ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించి, ఆ మర్నాడు, ఏప్రిల్‌ 28న వారిని కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల దెబ్బకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషన్‌కు తీసుకెళ్లి, ప్రైవేట్‌ పార్టులకు కరెంట్‌ షాక్‌ ఇస్తామని బెదిరించారు.

ఈ ప్రశ్నలకు బదులేది?:
    ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే, అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం?  పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూసినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్‌ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్‌ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్‌ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి.
    ఏప్రిల్‌ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో ఎలా బయటకొచ్చింది?. నిజానికి ఆ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీర్ణించుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు.
    ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్‌గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?:
    ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవ్వరు?.

అలా పరువు తీయడం ధర్మమా?:
    జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా.  జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌ కాదా?. ఈ పాప రాకేష్‌ చెల్లెలు. ఈమె ఇంజనీర్‌. రాకేష్‌ కూడా పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టి పరువు తీయడం ధర్మమేనా?.
    ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్‌ గ్రౌండ్‌  ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి?. అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్దాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?.

ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్‌:
    మరో వ్యక్తి కరీముల్లా. గతంలో అతడి మీద ఎలాంటి కేసులు లేవు. కానీ, అతణ్ని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్‌ విక్టర్, రాకేష్‌ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్‌ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గాలకు పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
    వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొచ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్‌ మీడియా ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్‌ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు. 

కోర్టుల అధికారాన్ని ఎలా తీసుకుంటారు?:
    కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా? పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా.
    ఇదే పోలీసులు చెప్పే లాజిక్‌. తెలుగుదేశం పార్టీ వారు సోషల్‌ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరును, ఈనాడు, ఆంధ్రజ్యోతి. టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.

కేసులు తేల్చాల్సింది కోర్టులు:
    పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశారు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టుల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని,  పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్‌ చేస్తూ వారి కుటుంబ పరువును తీయడం భావ్యమేనా? 

కాలు బాగాలేదని వేడుకున్నా..:
    ఇది రాకేష్‌ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్‌రే. అతడి కాలు విరిగితే ఆపరేషన్‌ చేసి లోపల రాడ్‌ వేశారు. ఆ విషయం మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్‌ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చితకబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమేనా?.

పోలీస్‌ రాజ్యం. హింసాకాండ:
    ఈ మధ్య కాలంలోనే హరికృష్ణ అనే వ్యక్తి మీద దాచేపల్లిలో తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్‌లో పడేస్తే వారి తల్లిదండ్రులు , గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్‌ ఇప్పించుకున్నారు. కానీ ఈ హరికృష్ణ ఇప్పటికీ గాయాలతో బాధపడుతూనే ఉన్నాడు. 
    రాజమండ్రిలో పులిసాగర్‌ అనే సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌. దళిత యువకుడిని పోలీస్‌ స్టేషన్లో రాత్రంతా అర్థనగ్నంగా నిలబెట్టారు. రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులా.. వీరు రాక్షసులా?. అని సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అతడి పరిస్థితి ఇది. 
    చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైయస్సార్సీపీకి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు సుధారాణి, పాలేటి కృష్ణవేణి మీద పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి. 

పోలీసు వ్యవస్థ దుర్వినియోగం:
    రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తూ కొందరు డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్‌ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు.  మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి.. పోలీసులకింత, ఎమ్మెల్యేకి ఇంత, చంద్రబాబుకి ఇంత, లోకేష్‌కి ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్‌ రూములు అనుమతిస్తున్నారు. ఆ ప్రతి పర్మిట్‌ రూమ్, ప్రతి బెల్ట్‌ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, ల్యాటరైట్‌.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అనేది ఉందా? అని ప్రశ్నిస్తున్నా. 

వారిని వెనకేసుకు రావడం లేదు:
    ఆ ముగ్గురు పిల్లలను నేను వెనకేసుకు రావడం లేదు. గొడవలు జరిగి ఉండొచ్చు. కేసులు పడి ఉండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు ఏది న్యాయం అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పులిస్తారు. ఆ తీర్పులు వెలువడే వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారన్నది మాత్రం గట్టిగా చెబుతున్నా.
    కానీ, కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా అడుగుతున్నా. 

కుటుంబాల పరువు తీస్తారా?:
    ఈ పాప రాకేష్‌ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. ఈ అమ్మాయి ఇంజనీర్‌. వీరి పరువు తీశారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్‌ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నిస్తున్నా. విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. విక్టర్‌ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్‌ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్‌. ఒక మాజీ జర్నలిస్ట్‌ కొడుకి పరిస్థితి ఇది. ఇది ధర్మమేనా అని ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. 

అన్ని వ్యవస్థలూ నాశనం:
    లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాళ తీసింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వకపోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందుకునే పరిస్థితి లేదు. 
    మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్‌ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికే రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. 

అందుకే ‘వెన్నుపోటు దినం’:
    మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటి అన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ను గాలికొదిలేశారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు.
    అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పమని మరొక్కసారి పిలుపునిస్తున్నా.
    ఇంకా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నానని వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

Back to Top