పల్నాడు: నాయకుడంటే గతంలో మోసం..నాయకుడంటే నేడు నమ్మకంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఇవాళ మూడో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...
అందరికీ నమస్కారం, ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదిగా రచించి, అమలుచేసి ప్రజల హృదయాలలో సుస్ధిర స్ధానాన్ని జగనన్న ఏర్పాటుచేయడానికి కారణం ఈ చేదోడు పథకం. అన్నా, మనిషి సౌందర్య సంరక్షకులుగా, శిరోజాలను సంస్కరించే నాయీ బ్రాహ్మణుడు, దర్జాగా జీవించాలంటే సరైన దుస్తులు కావాలి, దానికి దర్జా తనాన్ని ఇచ్చే దర్జీలు, మలినాన్ని పోగొట్టి మనిషిని శుభ్రంగా ప్రపంచానికి చాటే కారకులు రజకులు, ఈ ముగ్గురికి జగనన్న చేదోడు ఒక వరంగా మారింది. రక్తాన్ని చెమటగా మార్చి, కడుపు నింపుకోవడానికి కష్టమే పెట్టుబడిగా, ఉండడానికి నీడ లేక, పండడానికి గూడు లేక, జ్ఞానాన్ని ఆర్జించాలంటే చదువు అందక, తరాలుగా, తరతరాలుగా వృత్తి తప్ప వేరే జీవనం తెలియక, అందరితో సమానంగా జీవించాలన్న కోరిక ఉన్నా అందుకోలేక, తపించే మాకు లభించిన వరం జగనన్న చేదోడు అనే నమ్మకం. అన్నా మేం ఎవరిదగ్గరా చేయి చాపక్కర్లేదు, నాటి పాలకులు పదివేలు అప్పు ఇవ్వాలంటే అది కట్టడానికి మేం అప్పులు అవ్వాల్సి వచ్చేది, మేం ఆ రోజుల్లో ప్రభుత్వం ఏదైనా లోన్ ఇస్తే దానికి బెనిఫిషయరీ కాంట్రిబ్యూషన్ అని రూ. 3 వేలు లోన్కు భరోసా కట్టించేవారు, కానీ నేడు నేరుగా మా ఖాతాల్లో జగనన్న ఇచ్చిన ఈ భరోసా అందుతుంది. నాయీ బ్రాహ్మణులకు కుల వివక్షకు గురవకుండా ప్రత్యేక చట్టం తెచ్చారు, ఆలయ కమిటీలలో వారు బోర్డు మెంబర్లుగా ఏర్పాటుచేయడానికి చేసిన ప్రయత్నానికి ప్రత్యేక ధన్యవాదాలు. రజక సోదరులకు కూడా ఇలాగే, మా కులాల గురించి మాకంటే మీకే బాగా తెలిసినట్లుగా మా పిల్లల చదువుల కోసం, భవిష్యత్ కోసం గోరుముద్ద, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, ఆరోగ్యశ్రీ, సొంతింటి కల తీర్చిన జగనన్నను దైవ స్వరూపుడుగా మేం కొలుస్తున్నాం, ఏ నోట విన్నా ఇదే మాట. చేయత ద్వారా మా మహిళల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు. మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం, మా కుటుంబాలను సమగ్రంగా ఆదుకుంటున్న నాయకుడు మీరు. నాయకుడంటే గతంలో మోసం, నాయకుడంటే నేడు నమ్మకం, అన్నా ఈ చేదోడు ద్వారా మా జీవితాలకు భరోసా, భద్రత, భాగ్యాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధ్యాంక్యూ.

సాయి కుమారి, లబ్ధిదారు, వినుకొండ
అన్నా నమస్కారం, నేను జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందాను, మీరు ఇచ్చిన మొదటి విడత సాయంతో మిషన్, మెటీరియల్ కొనుక్కున్నాను, రెండో విడత డబ్బుతో జిగ్జాగ్ మిషన్ కొనుక్కుని నా కుటుంబ ఆర్ధిక పరిస్ధితిని అభివృద్ది పరుచుకున్నాను. నవరత్నాలలో భాగంగా వృద్దాప్య ఫించన్ ఈ నెల నుంచి మా మామయ్యకు రూ. 2,750 అందుతున్నాయి. అలాగే మా అత్తయ్యకు చేయూత పథకం క్రింద మూడు విడతలు, నేరుగా మా అత్తయ్య అకౌంట్లోనే పడ్డాయి, ఏ కార్యలయం చుట్టూ తిరగకుండా, ఏ ఇబ్బంది లేకుండా మీరు మా ఖాతాలో జమ చేశారు. మా అత్తయ్య కిరాణాషాప్ కూడా పెట్టుకున్నారు, నా కొడుకు చదువుతున్నాడు, అమ్మ ఒడి వస్తుంది, నాడు నేడు పథకం ద్వారా స్కూల్ను బాగా అభివృద్ది చేశారు, ప్రేవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చారు. నేను గర్భవతిని, నాకు పౌష్టికాహారం కూడా ఇస్తున్నారు, గర్భంలో ఉన్న శిశువుకు కూడా మీ పథకాలు అందిస్తున్నారు. నాకు ఇంటి స్ధలం కూడా వచ్చింది, మా మామయ్యకు గుండెనొప్పి వస్తే 108కి ఫోన్ చేస్తే హాస్పిటల్లో చేర్చారు, మా వాలంటీర్ గైడ్లైన్స్ ఇవ్వడంతో గుంటూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో రూ. 2.50 లక్షలకు పైగా విలువ చేసే వైద్యాన్ని మాకు ఉచితంగా అందించి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఆ తర్వాత మా మామయ్య జీవనోపాధికి రెండు నెలల పాటు రూ. ఐదు వేల చొప్పున మొత్తం రూ. పది వేలు ఆయన ఖాతాలో జమ చేశారు. ఈ విధంగా నాకుటుంబానికి మీ ప్రభుత్వంలో రూ. 11 లక్షల ఆర్ధిక సాయాన్ని పొందాను. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, మీరు చల్లగా ఉండాలి, ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాం.

సైదులు, లబ్ధిదారుడు, కొచ్చర్ల, ఈపూరు మండలం
అన్నా మా నాయీ బ్రాహ్మణుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను గత పది, పన్నెండు ఏళ్ళుగా నా కులవృత్తి చేసుకుంటున్నాను, నా షాప్ డెవలప్ చేయడం ఎలాగా అనుకునేవాడిని, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి చెబితే నేను నమ్మలేదు, కానీ మాకు అకౌంట్లో నేరుగా జమ అయ్యాయి. ఏ లంచం లేకుండా నా అకౌంట్లో డబ్బు పడింది. షాప్ డెవలప్ చేసుకున్నాను, ఇప్పటికి రెండు సార్లు సాయం అందింది, ఇది మూడోసారి నాకు అందుతుంది, మా అమ్మకు ఫించన్ వస్తుంది, తెల్లవారగానే వాలంటీర్ మా ఇంటికి వచ్చి రూ. 2,750 ఇస్తుంటే మా అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో చాలా అవస్ధలు పడ్డారు, ఇప్పుడు మా ఇంటికే ఫించన్ వస్తుంటే మా అమ్మ సంతోషంగా ఉంది, మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇక నుంచి మీరు నన్ను చూసుకోకపోయినా నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, మేం కన్న బిడ్డలమే కానీ మాకంటే మీరే మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. మీరు మా ఇంటిలో పెద్దకొడుకులాగా, మా సొంత అన్నలా ఉంటున్నారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధిపొందాం, మేం లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు పడితే చేయూత పథకం ద్వారా ఆదుకున్నారు. మాకు చాలా సాయం చేశారు, ధ్యాంక్యూ అన్నా.
