జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు

ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా 
 

 తిరుమల : వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శనివారం తిరుమల  వేంకటేశ్వరస్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలనను ఓర్వలేకే చంద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారన్నారు. కోడెల, యరపతినేని, దేవినేని ఉమా, అచ్చెంనాయుడు, బోండా ఉమా బాధితుల కోసం చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు.

నదులన్నీ పొంగి ప్రవహిస్తూ జలకళను సంతరించుకున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చే 100 రోజులు మాత్రమే అయినా అనేక సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ముందుకు వెళుతున్నారని కితాబిచ్చారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్ మెంట్, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు మద్దతుగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో రైతుబాంధవుడిగా నిలిచేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రోజా తెలిపారు. ఏపీ ప్రజలంతా ప్రశాంతంగా ఉంటే కృష్ణా జిల్లాలో వరదలంటూ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పునరావాస కేంద్రాలను టీడీపీ అవసరం లేకుండా పెడుతున్నారని విమర్శించారు. ‘యరపతినేని, కోడెల, బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు అరాచకాలకు ఎంతోమంది బలైతే చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదు. నారాయణ కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు చనిపోతే, పునరావాస కేంద్రాలను చంద్రబాబు ఎందుకు పెట్టలేదు. తప్పులు చేసి ఐదేళ్ల పాటు ప్రజలు మోసం చేసి చివర్లో పసుపు-కుంకుమ పేరుతో మోసం చేయాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. ఇలాంటి దుర్మార్గుడు వద్దనుకున్నారు. జగన్ మొదటి రోజు నుంచి కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలను ఆపాలి’ అని రోజా హితవు పలికారు. ఒకవేళ ఇలాంటివి ఆపకుంటే ఈసారి వచ్చిన 23 సీట్లు కూడా తెలుగుదేశానికి మిగలవని స్పష్టం చేశారు.

Back to Top