శ్రీకాకుళం: విశాఖ రాజధాని కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధం అని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. నూతనంగా ఏర్పాటయిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు అభినందించారు. ఇక్కడి ఏఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని అభినందించి, సమర్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. గతిలేని వాడు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది దేశంలో.. ! కొద్ది మంది ఆదాయాలను ఎక్కువ మందికి పంచడం సాధ్యం కాదు దేశంలో.. కానీ అమెరికా వ్యవసాయంపై ఆధారపడిన వారి సంఖ్య కేవలం నాలుగు శాతం. మన దేశంలో 65 శాతం ఆధార పడుతున్నాం. మనం వ్యవసాయానికి ఇతరుల కన్నా ఎక్కువ సాయం చేస్తున్నాం. అది సరిపోతుందా అంటే చాలదు కానీ దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా మనమే బెటర్ గా ఉన్నాం. పెట్టుబడి సాయం అందించడంలో కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ ఇంకా మార్కెట్ లో కొంత చొరవ తీసుకోవడం కానీ మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినా సరే ఎప్పుడూ ఆవేదనే మిగులు తుంది. ఇదే సమయంలో గిట్టుబాటు అయ్యే పంటలు వేయాలి. వ్యవసాయం చేసిన వాడిగా నాకు కష్ట సుఖాలు తెలుసు. లెక్క ప్రకారం ధాన్యం బస్తాకు మూడు వేల రూపాయలు ఇవ్వాలి. రక్తం ధారపోసే రైతుకు కేంద్రం సాయం అందించడం లేదు. ఇది ఎంతో కాలం సాగదు. దేశంలో ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసినా ఇంకా చేయాల్సి ఉంది. ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ ల్యాబులు పెట్టడం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇంకా ఇతర పద్ధతుల్లో సాయం అందిస్తున్నారు. ఈ విధంగా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఎంత చేసినా చాలదు. బీదవాళ్లకు నిరుత్సాహం లేకుండా చేసిన పని ఈ ప్రభుత్వం చేస్తుంది. స్వతంత్ర్య దేశంలో ఎవ్వరూ ఇలా లేరు. రైతుకు మద్దుతుగా నిలిచే సందర్భంలో మన ప్రభుత్వం అందరి కన్నా ముందుందని చెప్పారు. రకరకాలుగా పేదలకు ఇవ్వాల్సిన డబ్బు రకరకాలుగా మళ్లించేది. కానీ మన ప్రభుత్వం వ్యవస్థలను మార్పు చేయడం ద్వారా అవినీతి తగ్గింది. ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చిన కష్టం ఏంటంటే.. రాజధాని. అప్పుడు చెన్నయ్ వెళ్లేవాళ్లం అంటే 1100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. చాలా అవస్థలు పడి వెళ్లే వాళ్లం. ఆ తరువాత కర్నూలుకు రాజధాని వచ్చింది. ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అక్కడికి చేరుకోవాలంటే రెండు రోజుల సమయం పట్టేది. తరువాత హైద్రాబాద్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక వచ్చిన రాజధాని ఇది. 750 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ విధంగా అరవై ఏళ్లకు పైగా మనం ఇదే విధంగా ప్రయాణించి అక్కడికి చేరుకోవాల్సి వచ్చేది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యాక రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. క్యాపిటల్ వెతుక్కోవాల్సి వచ్చింది. మన పేరుతో ఉన్న క్యాపిటల్ పోయింది. అందువల్ల మనం క్యాపిటల్ వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏ విధంగా ఉండాలి అని చెబుతూనే, ఆ విధంగా పలు కమిటీలు తెరపైకి వచ్చాయి. పెద్ద రాజధాని పెట్టుకోవడం మంచిది కాదు. ఆ విధంగా వద్దు. పెద్ద నగరాల నిర్మాణం వద్దు అని ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టండి అని ఆ రోజు కేంద్రం నియమించిన కమిటీలు చెప్పాయి. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం వారు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చారు. హై కోర్టును కర్నూలులో పెట్టండి అని అన్నారు. అక్కడ శాసన రాజధాని ఏర్పాటుచేయాలి. ఎలానూ అమరావతి అన్నది ఉన్న కనుక శాసన రాజధానిగా ఉంచాలని జగన్ భావించారు. కానీ చంద్రబాబు తెలివిగా తనదైన రాజకీయం చేశారు. కానీ విశాఖ కు రాజధాని వస్తే మన ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. 130 ఏళ్ల తరువాత రాజధాని ఏర్పాటయ్యే అవకాశం వస్తే చంద్రబాబు వద్దని చెబితే ఎలా ? ఆ విధంగా అక్కడి రైతులతో ఇక్కడికి యాత్రగా వస్తున్నారు. మీకు రాజధాని వద్దు.. మీకు అభివృద్ధి వద్దు అని అక్కడి నుంచి వచ్చిన వాళ్లు ఇక్కడ చెబితే మన నోట్లో మట్టి కొడితే ఎలా ? ఏంటీ ఈ అన్యాయం.. ? ఒక్క వయసొచ్చిన కుర్రాడు ఈ ప్రాంతంలో ఉన్నాడా..వలస పోయిన యువత కోసం తల్లిదండ్రులు నిరీక్షణలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు మరణిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇంతటి దయనీయతల్లో మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని మాకు అన్యాయం చేస్తామని చెప్పడం తగదు. మీరు ఎవరి దగ్గరా తలవంచాల్సిన పని లేదు. విపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఇటువంటి వారిని శత్రువులుగా చూడండి. తరువాత తరాల భవిష్యత్ కోసం మనం పనిచేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే నా పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఆ విధంగా లక్షలాది మంది నాతో వెనుక వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి పౌరుడూ చైతన్యవంతం కావాలని, మూకళ్ల తాతబాబు అధ్యక్షుడిగా ఏర్పాటయిన ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్రమశిక్షణతో పనిచేయాలి అని కోరుకుంటున్నాను అని అన్నారాయన. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, వైస్ ఛైర్మన్ శాస్త్రి, ఎంపిపిలు అంబటి నిర్మల శ్రీనివాస్, గోండు రఘురాం, జెడ్పిటిసి రుప్పా దివ్య, వైస్సార్సీపీ నాయకులు ఎచ్చెర్ల సూరిబాబు, చిట్టి జనార్ధనరావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, శిమ్మ రాజశేఖర్, అంధవరపు సంతోష్, ప్రసాద్, గోండు కృష్ణ, చల్లా రవి కుమార్, పొన్నాడ, రిషి, ఎ.డి కాళేశ్వరరావు, సెక్రటరీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.