తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు పక్కా స్కెచ్తోనే పుంగనూరులో రెక్కీ చేయించారని సీరియస్ అయ్యారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఏ1 ముద్దాయి.. చంద్రబాబు రౌడీయిజం, బరితెగింపు పాల్పడినట్టు తెలిపారు. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా? అని ప్రశ్నించారు.
పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రౌడీమూకలతో యాత్రలు చేస్తున్నాడు. రాళ్లు, కర్రలు, తుపాకులు తీసుకుని వస్తున్నారు. పుంగనూరులో ముందు రోజే కర్రలు, రాళ్లు తెచ్చిపెట్టుకున్నారు. ఈ దాడిలో పదిమంది పోలీసులనైనా చంపాలనే కుట్ర చేసినట్లు రుజువైంది. అంగళ్లులో ఆయాసం.. పుంగనూరులో రౌడీవేషం ఇదీ చంద్రబాబు వైఖరి. రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు.
ఇంత బరితెగింపా!?:
చంద్రబాబునాయుడు అధికారం కోసం ఎంత చెడ్డకైనా ఒడిగడతాడని అందరూ అనుకుంటారు. అందరి అభిప్రాయం అదే.
2024లో కూడా ఆయనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థం కావడంతో మరింత బరితెగించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం,14 ఏళ్ల సీఎం పదవి, 15 ఏళ్లు విపక్షనేత అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఎంత అనుభవం ఉంటే మాత్రం ఏం లాభం, బుద్ధి మారకపోతే. పుంగనూరులో మరీ బరి తెగించారు. అక్కడ పోలీసు కాల్పుల్లో కనీసం 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోతే, దాన్ని పట్టుకుని శవ రాజకీయం చేయాలని, ఆ విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేశారు.
దుర్మార్గమైన స్కెచ్:
మరింత బరి తెగించి, పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గాల నుంచి రౌడీమూకలను దింపి, వారిని పోగేసుకొచ్చి, కార్లు, జీపుల్లో, ట్రక్కుల్లో రాళ్లు, కర్రలు, రాడ్లు, సీసాలు తెచ్చి, ఏదో ఒక విధంగా కనీసం ఒకరిద్దరు పోలీసులను అయినా చంపి, తద్వారా పోలీసు కాల్పుల్లో ఒక 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోవాలన్న ఒక దుర్మార్గమైన స్కెచ్ వేసుకుని చంద్రబాబునాయుడు పుంగనూరు వచ్చారని అర్ధం అవుతోంది.
పుంగనూరు బైపాస్ రోడ్ వద్ద పోలీసులు, టీడీపీ కార్యకర్తలు కాకుండా వేరే ఎవరున్నారు? అంతకు ముందు అంగల్లులో ఆయనను ప్రజలు అడ్డుకుంటే వారిని వైయస్సార్సీపీ కార్యకర్తలు అని ప్రచారం చేస్తున్నారు. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ ఒక పెద్ద కర్ర పుచ్చుకుని ఏదేదో చెబుతుంటాడు.
పుంగనూరులో పక్కాగా స్కెచ్ వేసుకుని వచ్చాడు. నిజానికి అక్కడ ముందుగా కార్యక్రమమే లేదు. అదే విషయం పోలీసులు చెప్పారు. కానీ, ముందురోజు అక్కడ రాళ్ళు, కర్రలు దాచారు. లేకపోతే హఠాత్తుగా పోలీసుల మీద వాటితో ఎలా దాడి చేయగలరు. అంటే రెక్కీ చేసి, ముందు రోజూ అక్కడ వాటిని దాచి పెట్టారు.
బాబు నైజం బయట పడుతోంది:
మామూలుగా ఒక సామెత ఉంది. మొహమాటస్తుడి మొహమాటాన్ని నీసు భోజనం దగ్గర.. అంటే మాంసం కూర దగ్గర చూడమంటారు. అంటే మాంసం దగ్గర కూడా మొహమాటపడతాడా? అని చూడమంటారు.
అలాగే చంద్రబాబు పెద్దరికాన్ని ఆయన అధికారంలో లేనప్పుడు చూడాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సూక్తులు చెబుతుంటాడు. కానీ ఆయన నైజాన్ని, తప్పుడు పెద్దరికాన్ని ఆయన అధికారంలో లేనప్పుడు చూడాలి. అలా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఇప్పుడు చూశాం.
టీడీపీ రౌడీలు, గూండాల చేత పోలీసుల మీద దాడి చేయించి, వారిలో కనీసం ఒకరిద్దరునైనా చంపాలి. దానికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపితే, కనీసం 10 మంది టీడీపీ కార్యకర్తలు అయినా చనిపోవాలని చంద్రబాబు కుట్ర చేశారు.
ఆ పోలీసులే లేకపోతే..?:
రాష్ట్రంలో గతంలో ఏ పార్టీ కూడా, ఎక్కడా, ఇలాంటి దారుణ రాజకీయాలు చేయలేదు. అసలు పోలీసులు చేసిన తప్పేమిటి? వారి డ్యూటీ వారు చేశారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మీ కుటుంబానికి, చివరకు నీ మనవడికి కూడా గన్మెన్ను నియమించుకున్నారు. అదే ఇవాళ అధికారంలో లేకపోవడంతో, వారినే చంపాలని కుట్ర చేశారు. ఒక పోలీసు కానిస్టేబుల్ కళ్లు పోయాయి. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఎందుకు ఈ ముసలి వయసులో అరాచకం అవసరమా చంద్రబాబూ?
పూర్తిగా గతి తప్పిన ఎల్లో మీడియా:
పుంగనూరులో పోలీసులపై దాడికి 100కు 100 శాతం చంద్రబాబే కారణం. ఆయనే బాధ్యుడు. టీడీపీ కార్యకర్తల దాడిలో అనేక మంది పోలీసులకు తీవ్ర గాయాలైతే.. ఎల్లో మీడియాలో కనీసం పోలీసులపై దాడులకు సంబంధించి చిన్న వార్త కూడా రాయలేదు. చివరకు వైయస్సార్సీపీ కార్యకర్తకు దెబ్బ తగిలితే.. అతణ్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని రాశారు.
అదీ మీ దౌర్భాగ్యం. నిజం చెప్పాలంటే.. టీడీపీ కార్యకర్తలకు గాయాలే కాలేదు. మీ పత్రికల్లో పోలీసుల గాయాల గురించి ఎందుకు రాయలేదు? ఇంకా, చంద్రబాబు మీదనే దాడి జరిగిందని ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది.
హైదరాబాద్ లో వ్యాపారం.. ఆంధ్రాలో రాజకీయం:
అదీ ఎల్లో మీడియా బరితెగింపు. వారంతా ఎక్కడ ఉంటారు. హైదరాబాద్లో ఉంటారు. అక్కడే ఇవన్నీ చేస్తారు. మీరు ఇక్కడ అన్నం తినరు. ఇక్కడ పడుకోరు. చివరకు మీరు చనిపోతే, మీ మృతదేహాలు కూడా ఇక్కడికి తేరు. మీరు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? మీకు పేపర్, టీవీ.. వ్యాపారం తప్ప, రాష్ట్రంతో మీకు ఏ బంధం ఉంది? మాతో వ్యాపారం చేయడం తప్ప, ఏమిటి ఇక్కడ మీకు బంధం ఉంది.
ఒక రాజకీయ పార్టీ పోలీసుల మీద కుట్ర చేసి, చివరకు చంపాలని చూస్తే.. ఒక్క వార్త అయినా వేశారా? కనీసం ఒక్క ఫోటో అయినా వేశారా? పోలీసుల మీద మీకు కనీసం సానుభూతి లేదా? అదేనా జర్నలిజమ్?
లోకేష్ పిచ్చి మాటలు:
ఇంకా ఒకాయన ఉన్నాడు. వెనకటికి ఒక సామెత ఉంది. తండ్రి బావి ఒడ్డున ఏదో చేస్తే.. కొడుకు ఏకంగా బావిలోనే చేశాడట. ఇప్పుడు అదే విధంగా లోకేశ్ ఏకంగా చిత్తూరు జిల్లా ఎస్పీనే బెదిరిస్తున్నాడు.
పోలీసులు లేనిదే కాలు బయట పెట్టలేడు. వారు లేకపోతే బతకలేడు. ఆయనకు 350 మంది పోలీసులు బందోబస్తు ఉంటే, వారూ సరిపోవడం లేదట.
అధికారంలో ఉన్నప్పుడు ఏడాది చిన్నారిని కూడా పోలీసు బందోబస్తు లేకుండా బయటకు పంపలేదు. ఇప్పుడు అదే పోలీసులను విమర్శిస్తూ.. వారి మీద దాడి చేసి కళ్లు పోగొట్టారు. ఇప్పుడు వారే మళ్లీ ఆపరేషన్ చేయిస్తారట. వారికి ఎంత మదం? ఎంత బలుపు?
అదే తండ్రీ కొడుకుల బాధ:
ముసలి తండ్రి, పడుచు కొడుకు.. వారి బాధ ఏమిటంటే.. చిత్తూరు ఎస్పీ టీడీపీ కార్యకర్తలపై కాల్పులు జరపలేదని ఉడికిపోతున్నారు. ఫైర్ చేసి కనీసం 10 మంది టీడీపీ కార్యకర్తలను అయినా చంపలేదన్నది వారి ఏడుపు. అందుకే చిత్తూరు ఎస్పీపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు.
బాబును కట్టడి చేయాలి:
మళ్లీ చెబుతున్నాం. పుంగనూరు దారుణకాండకు చంద్రబాబునాయుడే నూటికి నూరు శాతం బాధ్యుడు.
తప్పుడు ఆలోచనతో, కుట్రలు చేస్తున్న చంద్రబాబును వెంటనే కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లేకపోతే ఆయన, రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తాడు.
14 ఏళ్ళు సీఎంగా ఏం పొడిచారు బాబూ..?:
ఇంకా ముసలాయన కొన్ని మాటలు చెబుతున్నాడు. తాను రాయలసీమకు నీరు తేవాలని చూస్తుంటే.. నువ్వెడివిరా తెచ్చేది అని వైయస్సార్సీపీ కార్యకర్తలు అంటున్నారంట.
చంద్రబాబు 1995లో తొలిసారిగా సీఎం అయ్యాడు. ఆ తర్వాత 14 ఏళ్లు పదవిలో ఉన్నాడు. మరి అన్ని రోజులు ఏం పీకారు? (ఆ విమర్శ మీదే). రాయలసీమకు నీరెందుకు తేలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వస్తే.. ఏదేదో చేస్తామంటున్నారు. కానీ ప్రజలు అస్సలు నమ్మడం లేదు.
ముసలి తండ్రి. నడి వయస్కుడైన కొడుకు.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఏం పొడిచారు? అన్నది అందరికీ తెలుసు.
రాష్ట్రంలో మీరు ఎన్ని కుట్రలు, దుర్మార్గాలు చేసినా, అగ్గి పుట్టించాలని ప్రయత్నం చేసినా.. మళ్లీ మీకు వాత తప్పదు. అందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించండి.
అది ఎంత దూరమో.. ఇదీ అంతే:
నేను వ్యక్తిగతంగా చిరంజీవికి అభిమానిని. ఇక్కడే కాదు. పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదువుతూ సినిమాహాళ్ల వద్ద చిరంజీవి బోర్డులు, పోస్టర్లకు దండలు వేశాం.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి, అమరావతిలోని సచివాలయం ఎంత దూరమో.. ఇక్కణ్నుంచి అక్కడికి కూడా.. సరిగ్గా అంతే దూరం ఉంటుందని, ఎక్కువ, తక్కువ రాదని నా హీరోకు చెబుతున్నాను.
సినిమాలు వేరు. రాజకీయాలు వేరు:
చిరంజీవిగారిని ఒకటే కోరుతున్నాను. సినిమాను ఎవరైనా సినిమాగా చూడాలి. రాజకీయాన్ని ఎవరైనా రాజకీయంగా చూడాలి.
చిరంజీవిగారి మీద కానీ, రామ్చరణ్ మీద కానీ, ప్రభాస్ మీద కానీ, జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ, రవితేజ మీద కానీ, మహేష్బాబు కానీ, చిరంజీవి గారి తమ్ముడి కుమారులు, మేనళ్లులు కానీ. బెజవాడ కుర్రోడు రామ్ మీద కానీ.. ఎవరి మీద అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రోజైనా మాట్లాడిందా?
నాయకుడి మీద కక్షతో పాత్ర!:
ఇక్కడ ఒక నేత, సంక్రాంతి పండగ రోజు ప్రజలతో మమేకం అవుతూ డ్యాన్స్ చేస్తే.. అదే డ్రెస్ను ఒక నటుడికి వేసి, కథకు సంబంధం లేకుండా నటుడి పాత్ర ప్రవేశపెట్టి.. ఆయనతో డ్యాన్స్ చేయించి, హేళనగా మాట్లాడి అవమానించారు. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిమీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్లుగా పాత్రలు పెట్టి సృష్టించారు. కాబట్టి వారు ఎదుర్కోకతప్పదు.
గిల్లితే గిల్లుడు తప్పదు:
సినిమా రంగం వేరు. గతంలో ఎవరూ, ఏ పార్టీ నాయకుడైనా వారి గురించి మాట్లాడారా? నటుల రెమ్యునరేషన్ గురించి ప్రస్తావిస్తారా?
అందుకే మీరు గిల్లినప్పుడు.. వారూ గిల్లించుకోక తప్పదు. కథకు సంబంధం లేకుండా, ఒక నేత పాత్రను ఒక నటుడితో పోషించినప్పుడు.. ఇలాగే అన్నీ వస్తాయి. బాహ్య ప్రపంచంలో ఎవరైనా సరే గిల్లితే.. వారికి గిల్లుడు తప్పదు. ఇది వారు గుర్తు పెట్టుకోవాలి.
బాబూ నీ సొంతూరులో నీ పార్టీ ఏది?:
పుంగనూరు బైపాస్ రోడ్ వద్ద బందోబస్తుకు వచ్చిన చిత్తూరు పోలీసులు తప్ప ఎవరున్నారు? అంగల్లులో పెంట చేసింది మీరే. పుంగనూరులో విధ్వంసం చేసింది మీరే.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంత నియోజకవర్గం పుంగనూరు. ఆయన 40 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉండిపోయారు. మరి చంద్రబాబు సొంత ఊరేది? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ .. నీ తర్వాత ఎప్పుడైనా గెల్చిందా? అందుకే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి.
ఆ పోలీస్కు అండగా ఉంటాం:
పుంగనూరులో చంద్రబాబు కుట్రను భగ్నం చేసిన స్థానిక పోలీసులు, చిత్తూరు జిల్లా పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారు రాష్ట్రంలో అలర్లు జరగకుండా, అల్లకల్లోలం జరగకుండా అడ్డుకున్నారు. అదే విధంగా, ఆ దాడిలో గాయపడి చూపు కోల్పోయిన పోలీసుకు మా పార్టీ అండగా నిలబడుతుంది.
ఏం ఉద్ధరించావని..?:
అధికారంలో ఉన్నప్పుడు అనేక హామీలిస్తాడు. సాధ్యం కానివన్నీ చేస్తానంటాడు. అధికారంలోకి వస్తే ఏదీ చేయడు. ఇప్పుడు ఏ పని లేక, ప్రాజెక్టుల పేరుతో యాత్ర చేస్తున్నాడు. ఏం చేశాడో చెప్పుకోలేక సెల్ఫీలు దిగుతున్నాడు. ఏం ఉద్ధరించాడని ఆ పర్యటనలు? ఆ సెల్ఫీలు?. అని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని చంద్రబాబును నిలదీశారు.