రాజమండ్రి–కాకినాడ రోడ్డు నిర్మాణం చేపట్టండి

ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
 

అసెంబ్లీ: రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే ప్రధాన రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే ప్రధాన రహదారిలో ముఖ్యమైన కెనాల్‌ రోడ్డు పనులు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉండే ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి అప్పగించారు. సుమారు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులకు అవకాశమిచ్చినా కేవలం రూ.30 కోట్లు డ్రా చేసుకొని అర్ధాంతరంగా రోడ్డు నిర్మాణ పనులను ఆపివేయడం జరిగింది. ప్రజలు అనేక కష్ట, నష్టాలు పడుతుంటే మేము సుమారు 14 కి.మీలు వేలాదిమందితో పాదయాత్ర చేశాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే చేసింది. ఈ రోజుకు కూడా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు కాబట్టి ఆర్‌అండ్‌బి మినిస్టర్‌కి మీ ద్వారా తెలియచేస్తున్నాను. ఈ రోడ్డు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కనెక్టింగ్‌ రోడ్డు కాబట్టి తక్షణమే దానికి నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి’ అని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కోరారు.

 

Back to Top