తాడేపల్లి: వ్యవస్థలను ఖూనీ చేస్తున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, కేంద్రం నిధులు అడ్డుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఎన్నికలు వాయిదా వేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. బంధుత్వం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశంపై దెబ్బకొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 28వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యలను నేడు ఎందుకు తప్పుతున్నారని, ఎందుకు ప్లేట్ ఫిరాయించారని ఈసీని ప్రశ్నించారు. చంద్రబాబు తొత్తులా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించాడని, ప్రభుత్వంతో చర్చించకుండా, హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘కరోనా ఆంధ్రప్రదేశ్లో లేదు. అధికారులతో, చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. ఏపీలోకి కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని ఈసీ నిమ్మగడ్డ రమేష్∙గత నెల జరిగిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడించాడు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్లు వస్తాయి. మార్చి 31 లోపు ఎన్నికలు కంప్లీట్ చేయాల్సిందేనని చెప్పాడు. ఇంతలో ఏ మార్పు వచ్చిందని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ రోజు నుంచి ఇప్పటికి కరోనా పెరిగిపోయిందా..? లేక చంద్రబాబు తొత్తువా..? చంద్రబాబు సామాజిక వర్గం అయితే.. బంధుత్వం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. కానీ రాష్ట్రానికి చెందిన నిధులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉగాది నాటికి పట్టాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇంత కడుపు మంటా..? కరోనా వైరస్ చంద్రబాబుకు సోకింది. బాబులాంటి చీడ పురుగును తరిమికొట్టాలి. ప్రజలు వైయస్ఆర్ సీపీకి 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకువస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు.. నిధులు రాకూడదు.. ప్రజలు, ప్రభుత్వం ఇబ్బందులు పడాలనే కుట్ర చేసి చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. స్థానిక సంస్థల్లో టీడీపీ తరుఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఓటమి భయంతో, నిధులు అడ్డుకోవాలనే కుట్రతోనే ఎన్నికలు వాయిదా వేయించాడు. సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకొని రాష్ట్రంపై మీ పెత్తనం ఏంటీ..? సీఎం వైయస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్కుమార్ దుర్మార్గుల్లా అడ్డుపడుతున్నారు. యుద్ధంలోకి రాకుండానే చేతులు ఎత్తే దుర్మార్గమైన వ్యక్తులను తరిమికొట్టాలి. వ్యవస్థలను భ్రష్టుపట్టించే బాబును తరిమికొట్టాలి. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఈసీని విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు తాత్కాలిక ఆనందం పొందగలడేమో కానీ, శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొడతాం’ అని హెచ్చరించారు.