వికేంద్రీకరణకు మద్దతుగా చైతన్య కార్యక్రమాలు

ఈ నెల 6న మానవ హారాలు

యూనివర్సిటీల్లో చైతన్య సదస్సులు

భూముల కోసమే చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారు

అమరావతిలో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం 

వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు

13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి

అధికార, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా హర్షిస్తున్నారు

ఎమ్మెల్యే జక్కంపూడి

తాడేపల్లి: అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు ,ఆయన కుమారుడు, ఆయన అనుయాయులు అమరావతిలో వందల ఎకరాలు కొనుగోలు చేశారు. వారి భూములకు రేట్లు పడిపోతాయని ఇవాళ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వీరు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫి చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు  ఇస్తామని మాట ఇచ్చారు. దాదాపుగా 600 హామీలుఇచ్చి ఐదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రోజుకో గ్రాఫిక్స్‌ చూపిస్తూ ఒక రోజు సింగపూర్‌, మరోరోజు మలేషియా, రాజమౌళిని తీసుకొచ్చి సినిమా చూపించే ప్రయత్నం చేశారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చని చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించారు.  
వైయస్‌ జగన్‌ పాలనను ఒక్కసారి గమనిస్తే..ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతున్నారు. మేనిఫెస్టోను వైయస్‌ జగన్‌ పవిత్ర గ్రంథమైన బైబిల్‌, ఖురాన్‌, భగవత్గీత మాదిరిగా భావించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని వైయస్‌ జగన్‌  ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతున్నారు. నవరత్నాల పేరు చెప్పి గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలు ఇవాళ వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదవారికి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలా అండగా ఉన్నారో..ఇవాళ వైయస్‌ జగన్‌ కూడా భరోసా కల్పిస్తున్నారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలతో పేదల చదువులకు భరోసా కల్పించారు. 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమరావతిలోనే లక్షల కోట్లు పెడితే ఎలాంటి అభివృద్ధి ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల అభివృద్ధికి వైయస్‌ జగన్‌ ఒక ఆలోచన చేశారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుకు మద్దతు తెలిపారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంతో దిట్ట అని అనేకసార్లు చూశాం. అవినీతి, అక్రమ కేసుల్లో చంద్రబాబు రెడ్‌హ్యాండెండ్‌గా దొరికినా కూడా వ్యవస్థలను మేనేజ్‌ చేసుకొని ఏ రకంగా సమయాన్ని దాట వేస్తున్నారో చూశాం. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. అలాంటి వ్యక్తి మండలిలోని గ్యాలరీలో గుంటనక్కలా కూర్చొని చైర్మన్‌ను ప్రభావితం చేసి వ్యవస్థకు మచ్చ తెచ్చారు. వికేంద్రీకరణపై రాబోయే పది రోజులు ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర అభివృద్ధి, వికేంద్రీకరణకు మద్దతు పలుకుతూ ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ నెల 6వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా మానవహారం కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 7న క్యాండిల్‌ ర్యాలీ, 8న చంద్రబాబుకు బుద్ధి రావాలని ప్రతి దేవాలయంలో పూజలు, ప్రార్థనలు చేసే కార్యక్రమాలు, 10న రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, నిష్టాతులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నాం. 12న వంటా వార్పు,  13న రిలే నిరాహార దీక్షలు, 14న గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్లో చైతన్యం నింపే కార్యక్రమం. 15న అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత. అలాగే ఈ నెల 10న అనంతపురంలోని ఎస్‌కే యూనివర్సిటీ, 12న వైజాగ్‌లోని ఏయూ యూనివర్సిటీ, 14న తిరుపతిలోని  ఎస్వీ యూనివర్సిటీల్లో విద్యార్థులతో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.  చైతన్య కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని జక్కంపూడి రాజా కోరారు.

 

Back to Top