అనంతపురం: భారీ వర్షం కారణంగా అనంతపురం నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అనంతపురం నగర మేయర్ వసీం సలీమ్ పర్యటించారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ, రాప్తాడులో 40 మి.మీ, కూడేరు 32 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నార్పల, విడపనకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు, డి.హీరేహాళ్, శింగనమల, గుత్తి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షంతో అనంతపురం నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మేయర్ తన సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నీటిని వెలుపలికి పంపించారు. ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.