పెరిగిన ఇండియా జీడీపీ తలసరి

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2013-14లో 89,796 రూపాయలుగా ఉన్న భారతదేశ జీడీపీ తలసరి 2021-22 నాటికి 1,72,913 రూపాయలకు పెరిగిందని ప్రణాళిక శాఖ సహాయ మంత్రి  రావ్ ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. దేశ జాతీయ ఆదాయంలో  టాప్ 1 శాతం కలిగిన ధనికులు 40 శాతం, టాప్ 10 శాతం కలిగిన ధనికులు 57 శాతం ఉంటే, దిగువనున్న 57 శాతం మంది ప్రజలు జాతీయ ఆదాయంలో కేవలం 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారన్న వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్-2022 గణాంకాలు వాస్తవమేనా అంటూ సోమవారం రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్టు -2022 నివేదిక సందేహాస్పదంగా ఉండడంతో దానిని  పరిగణలోకి తీసుకోలేమని, ఆ నివేదిక ఆధారంగా కోరిన వివరాలపై వ్యాఖ్యానించలేమని మంత్రి తెలిపారు. దేశంలో పేదరికం,  ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, వీక్షిత్ భారత్ ఉద్దేశాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఏపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రతిపాదన లేదు
 ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి  అజయ్ భట్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ఢిఫెన్స్ కారిడార్లకు సేవలందించే విధంగా ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ అందించనున్నారా? డిఫెన్స్ కారిడార్లలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా చేపట్టనున్నారా? ఉంటే వాటికి సంబంధించిన వివరాలు తెలపాలంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్‌సీసీ కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్ధమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్‌సీసీ కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top