ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోండి

ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే హైదరాబాద్‌లో కూర్చొని ట్వీట్లు పెడతారా..?

వలంటీర్లను అవమానించేలా ప్రవర్తించడం బాధాకరం

చంద్రబాబు, పవన్‌లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజం

విజయవాడ: విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గ్రామ/వార్డు వలంటీర్లు పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వలంటీర్లను అవమానించేలా ప్రతిపక్షాలు మాట్లాడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం, బ్రిటన్‌ లాంటి దేశాలు కూడా వలంటీర్లను  నియమిస్తున్నాయన్నారు. విజయవాడలో రేషన్‌ సరఫరాను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజలు నిత్యావసరాలపరంగా, ఇతర అంశాలలో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. 

నిన్నటి నుంచి రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు రేషన్ తీసుకునేవిధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. రేషన్‌ లబ్ధిదారులు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటు,  ప్రతి ప్రాంతంలో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఐదు రైతుబజార్లు ఉంటే ఈరోజు 45 రైతుబజార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

విజయవాడలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. కృష్ణాజిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌లు కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అనుమానితులందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కరోనా బాధితుడు రికవరీ పొజిషన్‌లో ఉన్నాడని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. 

రాష్ట్ర ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మాత్రం హైదరాబాద్‌లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. వారిని అవమానించే రీతిలో హైదరాబాద్‌లో కూర్చొని ట్వీట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీచ రాజకీయాలు మానుకోవాలని పవన్‌, చంద్రబాబులకు వెల్లంపల్లి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రభుత్వాన్ని కించపరిచేలా చేయాలని చూడటం సరైన విధానం కాదని హితవుపలికారు.

తాజా వీడియోలు

Back to Top