తాడేపల్లి: భారతీయ జనతా పార్టీని టీడీపీ జనతా పార్టీగా కన్నాలక్ష్మీనారాయణ మార్చేశాడని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. దానికి అధక్షుడిగా సుజనా చౌదరి పనిచేస్తున్నారన్నారు. తాడేపల్లిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో కొందరు దుండగులు ఆలయ రథానికి నిప్పుపెట్టిన ఘటనపై చర్యలు తీసుకున్నామని, కావాలని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయం చేయడం సరికాదన్నారు. ఏదో ఘటనను ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సుజనా చౌదరి డైరెక్షన్లో కన్నా పనిచేస్తున్నాడన్నారు. సదావర్తి భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటే కన్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి భూములను వెనక్కి ఇచ్చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిందని, మేనిఫెస్టో కన్నాకు కనిపించలేదా..? అని నిలదీశారు.