అమరావతి: పేదరికం చదువుకు అడ్డుకాకూడదని, విద్యా వ్యవస్థలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు.. రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆమోదం తెలిపారని, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు కూడా చేసి పంపించారని గుర్తుచేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నామని వివరించారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకువస్తున్న పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా రెగ్యులేటర్ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించనున్నామన్నారు.