అల్పులే భౌ భౌ.. అని అరుపులు

కటారుపల్లిలో వేమన విగ్రహ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆర్కే రోజా

ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుంది

సజ్జనుడంటే వైయ‌స్ జగన్‌ గారే..

కంచులెన్ని మోగినా.. అవి వీకెండ్‌ అరుపులు మాత్రమే..

వేమన ప్రజాకవి, తాత్వికుడు...

మంత్రి ఆర్కే రోజా

 స‌త్య‌సాయి జిల్లా:  అల్పులు భౌ భౌ అని అరుస్తున్నార‌ని మంత్రి ఆర్కే రోజా విమ‌ర్శించారు.  ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు భౌ..భౌ.. అని  అరుస్తున్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోంద‌ని అన్నారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను,  సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా...అని వేమన గారు పద్యం రాశారు.  మన రాష్ట్రంలో సజ్జనుడు అయిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌ గారు.. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారు. వారంతా... గుంపులుగుంపులుగా వస్తున్నారు. ఎవరెంతమంది కలిసొచ్చినా... సింహం సింగిల్‌గానే వస్తుంది... కంచులెన్ని మోగినా.. అన్నట్టు వారంతా వీకెండ్‌ పొలిటీషియన్స్ మాత్రమే... అంటూ మంత్రి  రోజా విమర్శించారు. యోగివేమన జయంతి ఉత్సవాల సందర్భంగా  శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో గురువారం వేమన విగ్రహావిష్కరణ అనంతరం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు.
అల్పుణ్ని కంచుతోను, సజ్జనుణ్ని బంగారంతోనూ వేమన గారు  పోల్చారు. సజ్జనుడంటే అందుకు  వైయ‌స్ జగన్‌ గారే ఉదాహరణ. పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని, సంక్షేమానికి నడుం బిగించారు. తల్లిదండ్రులను పట్టించుకోని నేటి సమాజం గురించి  ఆనాడే వేమన తన పద్యాల్లో వర్ణించారని శ్రీమతి రోజా కొనియాడారు.  మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే తెలుగమ్మాయిగా తనకు పర్యటక శాఖ మంత్రి పదవినిచ్చారని అన్నారు. 

వేమన ప్రజాకవి, తాత్వికుడు...
 రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. సంతోషంగా ఉంది.
 350 సంవత్సరాలైనా ఇప్పటికీ వేమన పద్యాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకుంటున్నామంటే వేమన గారి ఘనత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతో గొప్ప ప్రజాకవి, సామాజిక విప్లవకవి, ఆయనలో ఒక తాత్వికుడు ఉన్నారని ఆయన పద్యాలు నిరూపిస్తాయి. పండితులతో పాటు పామరులు కూడా మెచ్చిన పద్యాలను వేమన రాశారు. 

వేమన పుట్టిన గడ్డపై పుట్టడం అదృష్టం...
వేమన  పుట్టిన తెలుగు గడ్డపై మనమూ పుట్టడం మన అదృష్టంగా భావించాలి. ఇప్పటికీ ఆయన సమాధికి పూజలు చేస్తున్నారు. 17వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఆయన పద్యాలను నెమరేసుకుంటున్నారంటే ఇంతకన్నా వేమన గురించి చెప్పాల్సిన పనిలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం చాలా మంది కవితలు రాస్తారు. కానీ వేమన ప్రజా చైతన్యానికి ప్రాధాన్యమిచ్చి  పద్యాలు రాశారు. ఒక చిన్నపద్యంలో ఎంతో భావాన్ని గుదిగుచ్చడం వేమన ప్రత్యేకత. ..విశేషం. ఇలాంటి పద్యాలకు మన సమాజం దర్పణం పడుతుంది.   ప్రపంచంలోని తెలుగువారందరికీ వేమన గురించి తెలిసేవిధంగా ఈ జయంతి వేడుకలను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ గారి ఆశీస్సులతో నిర్వహించడం కొనియాడదగిన విషయమని మంత్రి రోజా అన్నారు.

Back to Top