పేదల గుండెల్లో నిలిచిపోయేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పారు

45 ఏళ్ల పైబడిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల సాయం

వైయస్‌ఆర్‌ చేయూత పథకం అమలులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: పేద ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన సమస్యలను నవరత్నాలు, 2 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచి దాదాపుగా అన్నీ అమలు చేస్తున్నారన్నారు. ఏయే పథకం.. ఏయే నెలలో అమలు చేస్తామో ముందుగానే క్యాలెండర్‌ విడుదల చేసి మరీ నెలలు మూడు నాలుగు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత పథకం అమలులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.

‘ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో వినూత్నతను తీసుకువచ్చారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరవేర్చే విధంగా వలంటీర్లను తెచ్చారు. ఈ విధమైన పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 31.5 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చిన రాష్ట్రంలో దేశంలోనే లేదు. ఆ ఘనత మన ముఖ్యమంత్రికే దక్కింది. ఇప్పటికే 15.60 వేల ఇళ్లను మంజూరు చేశారు. 

ఈ రోజు వైయస్‌ఆర్‌ చేయూత రెండో విడత కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. గతంలో మొదటి విడతలో 24 లక్షల మందికి రూ.18,750 చొప్పున దాదాపు రూ.4,500 కోట్లు ఇవ్వడం జరిగింది. రూ.18,750 చొప్పున నాలుగు దఫాలుగా రూ.75 వేలు ప్రతి మహిళలకు ఇచ్చే పరిస్థితి ప్రియతమ నాయకులు కల్పించారు. అదే విధంగా రెండో విడతలో 23,44,572 మందికి దాదాపు రూ.4,340 కోట్లు విడుదల చేయనున్నాం. ఈ విధంగా నాలుగు సంవత్సరాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు కేటాయించడమే కాకుండా.. అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. 

అమూల్, హిందుస్తాన్‌ యూనిలివర్, రిలియన్స్, ఐటీసీ ఇవే కాకుండా ఇంకా 14 సంస్థలు వైయస్‌ఆర్‌ చేయూత పథకంలో భాగస్వాములు అవుతామని ముందుకువచ్చాయి. సలహాలు, సాంకేతిక సమస్యలు పరిష్కరించడం కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రభుత్వ పథకం ఏ ఒక్కటీ వర్తించకపోయినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆ కొరతను కూడా తీర్చుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని రూపొందించారు. దీంట్లో అత్యధికంగా బీసీలు 61 శాతం, ఎస్సీలు 24 శాతం, మైనార్టీలు 9 శాతం, ఎస్టీలు 6 శాతం లబ్ధిపొందుతున్నారు. కోవిడ్‌తో ఆదాయం తగ్గిపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా.. క్యాలెండర్‌ ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 
 

Back to Top