టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయండి..ఎన్నిక‌ల‌కు వెళ్దాం!

మంత్రి మేరుగ నాగార్జున స‌వాలు
 

అమ‌రావ‌తి:   టీడీపీకి దమ్ముంటే మీ వాళ్లంతా రాజీనామా చేయండి.. ఎన్నికలకు వెళ్దాం అంటూ మంత్రి మేరుగు నాగార్జున స‌వాలు విసిరారు. గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధైర్యంగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌కు వెళ్లార‌ని మంత్రి గుర్తు చేశారు. టీడీపీకి ఆ ద‌మ్ముందా అని చాలెంజ్ చేశారు.  అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ… రాజధానికి సంబంధించి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోంది.. ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది ఉన్నారు? అని ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారే అన్నారు. నక్కా ఆనంద్ బాబు మీ స్థాయి ఏంటి?  వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? అంటూ మండిప‌డ్డారు. మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని న‌క్కా ఆనంద్‌బాబు అన్నార‌ని గుర్తు చేశారు. అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నాం అన్నారు. చంద్ర‌బాబు ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన.. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధ కలుగుతుంది ! అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా చప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు.. నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు అని విమ‌ర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశారని విమర్శించారు.. ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా? అని నిలదీశారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్‌ విసిరారు. 

Back to Top