రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత‌కు వైయ‌స్ జగన్ గారే నిదర్శనం..

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున 

మూడేళ్ళలోనే 99 శాతం హామీలు అమలు చేశాం

చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ.. అమలు తక్కువ

టీడీపీ హయాంలో పథకాలన్నీ కాగితాలకే పరిమితం

అంటరానితనానికి, అట్రాసిటీకి నిలువెత్తురూపం చంద్రబాబు

తాడేప‌ల్లి: ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.44(99 శాతం)శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. చంద్రబాబునాయుడుకు ఆర్భాటం ఎక్కువ.. అమలు తక్కువ.. అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రభుత్వం ప్రతి పేదవాడికీ అవసరమైన సంక్షేమ పథకాలను తలుపుతట్టి మరీ అందిస్తున్నప్పుడు, చంద్రబాబు రోడ్లపై పెడుతున్న అన్న క్యాంటీన్లకు ఎవరు వస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని ధ్వజమెత్తారు.

         ఎన్నికలకు ముందు వైయ‌స్ఆర్‌ సీపీ ప్రకటించిన మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంధంగా భావించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు, అందులో ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచ తప్పకుండా అమలు చేశారని చెప్పారు. ఇచ్చిన హామీల్లో 98.44% హామీలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ గారు అని, దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని నాగార్జున ప్రశంసించారు. 

చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఎన్నో హామీలను ఇచ్చినా, వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, అమలు చేసింది తక్కువ అని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను కాగితాలకే పరిమితం చేసి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు చంద్రబాబు అన్యాయం చేసారని ధ్వజమెత్తారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క  పథకం కూడా అన్ని వర్గాల వారికి అందలేదని విమర్శించారు. 2017లో ఈ పథకాలలో లబ్దిదారులుగా బీసీ కులాల వారిని చేర్చినా, వారికి లబ్దిమాత్రం చేకూరలేదని ఆరోపించారు. 2018-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 17,709 మందికి ఈ సహాయం అందకుండా ఆపేసారని, తద్వారా బీసీలకు రావాల్సిన రూ.68 కోట్లను ఎగ్గొట్టారని నాగార్జున తెలిపారు. 

అక్టోబరు 1 నుంచి.. మా ప్రభుత్వ అమలు చేయబోయే .. కళ్యాణమస్తు, షాదీ తోఫాల ద్వారా.. గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు. 

ఆ వివరాలను మంత్రి వెల్లడిస్తూ.. 

  • ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది కేవలం రూ. 40వేలే.
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది కేవలం రూ.75వేలు. 
  • ఎస్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలే.
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలే.
  • బీసీలకు  రూ. 50వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు
  • బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు
  • మైనార్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. 
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే.. అని వివరించారు. 

రాష్ట్రంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి న్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దళితులపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎక్కువగా జరిగాయన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరి హయాంలో ఏం జరిగిందో.. బహిరంగ చర్చకు మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.  టీడీపీ చేస్తున్న పిచ్చి చేష్టలు, పిచ్చి ప్రేలాపలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని, ముఖ్యమంత్రి  గారిపై నిందలు మోపుతూ,  ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాయిస్తూ, దళితులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు దుష్ట రాజకీయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ దళితుడూ సహించడు అన్నారు. అంబేద్కర్ వాదులు, జగ్జీవన్ రామ్ వారసులు ఊరుకోరని, చంద్రబాబును తరిమికొడతారని నాగార్జున హెచ్చరించారు. 

- చంద్రబాబు నాయుడు ఎస్సీల ద్రోహి అని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు భూములు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన చంద్రబాబునాయుడు అంటరానితనానికి, అట్రాసిటీకి నిదర్శనం అని మంత్రి నిప్పులు చెరిగారు.
 

Back to Top