‘ఐటీ’ని విస్తరించేందుకే సీఎక్స్‌ఓ సదస్సు

రెండు వేల ఎకరాలలో 3 కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణం

ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్‌

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విజయవాడ: ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్‌ అందిస్తామని, ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీ, డిజిటల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఐటీ పరిశ్రమ విస్తరణ కోసమే సీఎక్స్‌ఓ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచనలతో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పాదయాత్రలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని.. అందుకే నాణ్యమైన విద్య, వైద్యం అందించేలా సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ అభివృద్ధి, నాణ్యమైన మానవ వనరుల తయారీకి కృషి చేస్తున్నామన్నారు. 

కోవిడ్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని.. అలాంటి సమయంలో ఎంఎస్‌ఎంఈలను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకొచ్చి వారిని ఆదుకుందని మంత్రి గౌతమ్‌రెడ్డి గుర్తుచేశారు. జగనన్న తోడుతో చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు సహకరించామన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఐటీ మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టామని చెప్పారు. రెండు వేల ఎకరాలలో 3 కాన్సెప్ట్‌ సిటీలను నిర్మించబోతున్నామని వెల్లడించారు.
 

Back to Top