దేవాన్ష్‌ను ఇంగ్లీష్‌ మీడియంలో ఎందుకు చేర్పించావు బాబూ?

ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం

విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యబోధన

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: చంద్రబాబుకు తెలుగు భాషపై అంత ప్రేమ ఉంటే ఆయన కుమారుడు లోకేష్‌, మనవడు దేవాన్ష్‌ను ఎందుకు ఇంగ్లీష్‌ మీడియంలో చేర్పించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ..ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏ మంచి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు గిట్టడం లేదని విమర్శించారు. కాకినాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు.

ఆ రోజు అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రైవేట్‌ పైనాన్స్‌ కంపెనీ ప్రజలకు మోసం చేస్తే..తాను చెల్లించాడని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, భవిష్యత్‌ తరాల కోసం అడుగులు వేస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ఒక గొప్ప విప్లవాత్మకమైన గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి,  ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో చదివిన పిల్లలు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నాడు- నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకురావాలని వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతూ..తెలుగును కంపల్సరీ చేస్తూ గొప్ప సంస్కరణను తీసుకువచ్చారన్నారు. ఇప్పటి వరకు 24 లక్షల మంది తెలుగు మీడియంలో చదువుతున్నారని, వీరికి ఇంగ్లీష్‌ నేర్పిస్తే ప్రపంచంతో పోటీ పడతారని సీఎం ఆలోచన చేశారన్నారు. ఇంగ్లీష్‌పై పట్టులేక ఎంతో మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారన్నారు. గ్రామీణ, పేద పిల్లలకు ఇంగ్లీష్‌ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే కమ్యూనికేషన్‌ పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయంతీసుకుంటే చాలు చంద్రబాబుకు కడుపు మంట పుడుతుందన్నారు. తెలుగును ఖూనీ చేస్తున్నది టీడీపీనే అని విమర్శించారు. టీడీపీ పాలనలో తెలుగును నిర్లక్ష్యం చేశారన్నారు. తెలుగు మీద ప్రేమ ఉన్న చంద్రబాబు ఎందుకు లోకేష్‌ను, దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చేర్పించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారన్నారు. ఇంగ్లీష్‌లో పూర్తిగా పట్టులేకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతారో చంద్రబాబుకు తెలుసు అన్నారు. వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకోవడం వల్ల ఇంగ్లీష్‌ చక్కగా మాట్లాడగలుగుతున్నారన్నారు. పేద పిల్లలందరికీ ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు ఆ దిశగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. ప్రతి దానిపై చంద్రబాబు బురద జల్లుతున్నారని, ఇంగ్లీష్‌ మీడియం అమలుపై బురద జల్లడం మానుకోవాలని కన్నబాబు హితవు చెప్పారు. 

 

Read Also: కేంద్ర ఇంధన శాఖమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

తాజా వీడియోలు

Back to Top