సీఎం వైయ‌స్ జగన్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం

నిబద్ధత లేని వ్యక్తి ప‌వ‌న్‌, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా? అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తాము అసలు గుర్తించడం లేదని మంత్రి   స్పష్టం చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. పవన్‌ కల్యాణ్‌ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్‌ మాత్రమేని మంత్రి కాకాణి విమర్శించారు.  కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే మీ పని అని ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

 విషం చిమ్ముతోంది ఈనాడేః
        ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే అలవాటుగా మారింది. ప్రజలకు మేలు చేసేలా, ఏ మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నా దాన్ని చిలువలు, పలువలు చేసి విమర్శించడంలో టీడీపీ, ఎల్లో మీడియా ముందుంటున్నాయి. ప్రజలకు మేలు జరుగుతుంటే.. వీరికి ఎందుకు కడుపు మంట?. అని ప్రశ్నిస్తున్నాం.  అంటే ప్రజలకు మేలు జరిగితే.. వీళ్ళ మొహం చూసే దిక్కు ఉండని, ఆ పార్టీలకు శాశ్వతంగా ప్రజలు సమాధి కడతారన్న భయంతోనే నిత్యం ప్రభుత్వంపైన విషం చిమ్ముతున్నారు.  సీఎం జగన్‌ గారు నిన్న వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేసిన సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో విమర్శలు ప్రారంభించారు. జగన్‌ గారు విషం చిమ్మారంటూ ఈనాడు పత్రికలో రాశారు. ప్రభుత్వంపైనా, ప్రజలపైనా ఈనాడు పత్రికే విషం చిమ్ముతోందని చెప్పాలి.  2019 అక్టోబరు 15 నుంచి ప్రారంభమైన రైతు భరోసా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నిన్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి  గారు ఈ సాయాన్ని బటన్‌ నొక్కి  లబ్ధిదారులైన రైతులందరికీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన కౌలు రైతులు, అటవీ చట్టం కింద ఉన్న అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 సాయం అందిస్తూ వస్తున్నాం. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 27,062 కోట్ల సాయాన్ని అందించాం. మాండూస్ తుపాను సాయంతో కలిపి ఇప్పటివరకు పెట్టుబడి రాయితీ కింద రూ.1912 కోట్ల సాయాన్ని నిన్న జగన్‌ గారు రైతులకు బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేశారు. రాష్ట్రాలు పలురకాల పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తే...కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో  రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, పనులు చేపడతాయన్న విషయం అందరికీ తెలిసిన సంగతే. బడ్జెట్‌ అంటే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ. మీరింత ఇచ్చారు...వాళ్లింత ఇచ్చారని ...బురద జల్లుడు దురదృష్టకరమనిచెప్పాలి. 

ప్లేటు ఫిరాయింపులో బాబు సిద్ధహస్తుడుః
        జగన్‌ గారు బటన్‌ నొక్కి  లబ్ధిదారులకు పథకాల సాయాన్ని అందిస్తుంటే .. రాష్ట్ర ఆర్థిక స్థితి దెబ్బతిందని అనేకసార్లు బాబు విమర్శలు చేశాడు. ప్రజలు సోమరిపోతులవుతున్నారని బాధపడిపోయాడు. ఇప్పుడేమో...బాబు అదేనోటితో  జగన్‌ గారి పథకాలన్నీ కొనసాగిస్తానని  ప్లేటు ఫిరాయిస్తున్నాడు. మనసులో వీటన్నిటినీ ఆపేయాలని ఆలోచన...పైకి చెప్పలేడు కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలను ఏదోరకంగా మోసగించాలన్నదే బాబు ఆలోచన.  పథకాలిచ్చే జగన్‌ గారిని కాదని వాటిని ఇవ్వని బాబు పట్ల ఆసక్తి చూపే వారెవరూ ఉండరు.  బాబుదంతా కాపీ - పేస్ట్‌ విధానమే. పాతవి కాపీ కొట్టడం తప్ప కొత్త పథకాలు బాబు ఎప్పుడైనా ప్రవేశపెట్టాడా? 
- నవరత్నాలు... అమ్మ ఒడి, చేయూత, చేదోడు, నేతన్ననేస్తం, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన...ఇలాంటి పథకాలు ఎప్పుడైనా ఆలోచించావా చంద్రబాబూ?. మేం అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పెంపుడు కుక్కలు మొరిగినట్లు మొరగడం తప్ప మరొకటి లేదు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. బాబు ఒక దొంగ, వంచకుడు అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. చేసింది చెప్పే ధైర్యముంది కనుకే మేం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగుతామని సవాలు విసురుతున్నాం. 

బాబు రుణ మాఫీ చేయలేదని ఎందుకు రాయరు..?
        2014–19 మధ్య చంద్రబాబు హయాంలో  కరవు ఉందా? లేదా..?. ఏటా కరువు మండలాలు ప్రకటించింది వాస్తవం కాదా? అని మేం ప్రశ్నిస్తే దానికి ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తారు. 
బాబు హయాంలో కరవు మండలాలు ప్రకటించారు. ఈ ప్రభుత్వ హయాంలో కరవు మండలాలే లేవు. ఈ ప్రభుత్వంపై బురద జల్లడమే మీ లక్ష్యం. రైతుల సంక్షేమం గురించి మీరు ఆలోచించరు. ఎల్లో మీడియాలో మీరిలా రాస్తారని తెలిసే,  నేను నిన్న మాట్లాడిన సందర్భంలో గాడిద కేం తెలుసు గంధపు చెక్కల వాసన...అన్న సామెతను కూడా గుర్తు చేశాను. 
- 2014 కు ముందు బాబు భేషరతుగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడా? లేదా? మీరు వాగ్దానం చేశాడని రాస్తారా? చేయలేదని చెబుతారా?. వాస్తవాలు రాయాలంటే.. చంద్రబాబు భేషరతుగా చేస్తానన్న రుణ మాఫీ చేయలేదని ఈనాడు రామోజీ ఎందుకు రాయరు.?
- రుణ మాఫీ ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక,  బాబు కోతలు కోయడానికి కోటయ్య కమిటీ వేశారు. రుణమాఫీని ఎలా ఎగ్గొట్టాలా? అని ఆలోచించి రకరకాల షరతులు పెట్టారు.  వాస్తవానికి  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కింద రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పారా?. 
- మీ మోసాలకు, వంచనలకు భిన్నంగా... మేం అధికారంలోకి వచ్చే ముందు జగన్‌ గారు ఏయే వాగ్దానాలు చేశారో వాటికి కట్టుబడి రూ.12,500 రైతులకు ఇస్తామని చెప్పారు. దాన్ని రూ. 13,500కు పెంచి మరీ అయిదువిడతలుగా  రైతుభరోసా ఇస్తున్నాం. ఇది వాస్తవమా ? కాదా?. రైతుల పట్ల మీకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు.

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుందిః
          పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. వర్షాలు సకాలంలో కురుస్తాయి.  జలాశయాలు నిండుతాయి. రైతులకు ఇవ్వాల్సిన సమయం కన్నా ముందే నీరివ్వగలిగాం. పంటలు బాగా పండాయి. మీ హయాంలో ఇవేవీ జరగలేదు. తాగు, సాగునీటికి రైతులు విలవిలలాడారు. కరవు విలయతాండవం చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఏటా కరవు మండలాలే. మేమేం చెప్పినా వక్రీకరించడం మీకు అలవాటుగా మారింది. ఉదాహరణకు రేటు లేనప్పుడు ధాన్యానికి రేటు లేదంటారు. రేటు బాగుందని చెబితే ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్లనే  ధాన్యం రేటు పెరిగిందని అంటారు. ఏదైనా మీరే ప్రశ్న వేస్తారు. మీరే సమాధానం చెబుతారు.  బాబు వ్యవసాయం దండగ అంటే మీ ఎల్లో పత్రికలు నోరెత్తలేదు.  సాగునీటి ప్రాజెక్టులు కడితే పెట్టుబడి వ్యయం తప్ప ఆదాయం రాదని చంద్రబాబు తన మనసులో మాట పుస్తకంలో చెప్పారు.  ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా? దేశ చరిత్రలో ఇలా మాట్లాడే వ్యక్తి ఒక్క బాబు మాత్రమే.  అలాంటి వ్యక్తి ఏం మాట్లాడినా దాన్నే గొప్పగా ప్రొజెక్టు చేస్తారు. ఈ రోజు  నెల్లూరు, సంగం ప్రాజెక్టులు  పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ సీబీఐపీ ఇంపాక్ట్‌ స్టడీ చేసినప్పుడు కొత్త ప్రాజెక్టులపై నిర్వహించిన సర్వేలో ప్రాజెక్టులన్నీ రైతులకు ఉపయోగపడ్డాయని, ఫలసాయం ఎక్కువ వచ్చిందని నివేదిక ఇచ్చింది.  ఈ నేపథ్యంలో ఒక అవార్డు మా ప్రభుత్వానికి వచ్చింది. 

కుప్పంలోనూ బాబుకు పలాయనమేః
        చంద్రబాబు- కుప్పంలో పలాయనం చిత్తగించక తప్పని పరిస్థితి. కుప్పంలో మున్సిపాల్టీలో ఓడిపోయావు. నారావారి పల్లెలో ఆఖరికి బాబు చదువుకున్న స్కూలునే బాగు చేయలేకపోయాడు.  ఆంధ్రా ప్రజల ఆదరణ లేక బయటి రాష్ట్రాల నుంచి జనాన్ని కిరాయికి తెచ్చుకునే స్థితికి బాబు దిగజారాడు. నీ కొడుకు లోకేశ్‌ యువగళానికి బయటి రాష్ట్రాల నుంచి జనాన్ని రప్పించుకుంటున్నారు.   వలంటీర్లుగా 400 మందిని భద్రతగా తెచ్చుకున్నారు. ఇందులో వంద మందికి మించి నీ కొడుకు పాదయాత్రలో లేరంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలి. వాటన్నిటినీ పక్కనపెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కనుక నువ్వు ఆత్మస్తుతి పరనిందలా సాగిస్తున్నావు. 
- జగన్‌ గారి పాదయాత్రతో నీ కొడుకు పాదయాత్రకు పోలిక ఎక్కడుంది? పాదయాత్రలో జగన్‌ గారు చూసిన ప్రజా సమస్యలన్నిటికీ పథకాల రూపమిచ్చి, అన్ని వర్గాల సంక్షేమాన్ని కేలండర్‌ క్రమంలో అందిస్తున్నారు. విశ్వసనీయతతో పథకాల సాయాన్ని లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు.  రైతుభరోసా–పీఎంకిసాన్‌ సాయం కింద అందించే సాయంపై విషం చిమ్మడం సరికాదు. బాబు డొల్లతనం అంతా ఇలాంటి వంచనాపూరిత మాటలతో బయటపడిపోతోంది. 

175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యముందా?
        175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఏ పార్టీకి అయినా ఉందా? అని జగన్‌ గారు సవాల్‌ విసిరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి చూస్తే 2019 లో మాత్రమే టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. సంజయ్‌ విచార్‌మంచ్, బీజేపీ, వామపక్షాలు, టిఆర్ఎస్, జనసేన, అనధికారికంగా కాంగ్రెస్... ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఏదో ఒక పార్టీతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకునే పోటీ చేసింది. 2019 లో ఇతర పార్టీలు మీతో కలవలేదు... కారణం ఏంటంటే టీడీపీ లాంటి దరిద్రపు పార్టీతో పోటీ చేయడానికి వారికి ఇష్టం లేక కలిసి రాలేదు. ఒంటరిగా పోటీ చేయలేకపోవడమే బాబు వైఫల్యానికి నిదర్శనం...

ఏ మేలు చేయలేదు కనుకనే బాబును తరిమి కొట్టారుః
         మేం ఒంటరిగా పోటీ చేస్తాం. మేం నమ్మకం, బలం ప్రజలే. ఆ మాట మీరెందుకు చెప్పలేకపోతున్నారు..?. మీ హయాంలో మీరు ప్రజలకు మంచి చేయలేదు కనుకే ఇతర పార్టీలతో పొత్తులకు తాపత్రయ పడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి,  అయిదేళ్ల పాలన చేసిన తర్వాత తన వైఫల్యానికి బాబు సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వేం చేయలేదు కాబట్టి జనం తరిమి తరిమి కొట్టారు. అందుకే, ఇప్పుడు కూడా మిగతా పార్టీలను కలుపుకుని, వారి ఓట్లతో తాను పైకి రావాలని చంద్రబాబు చూస్తున్నాడు. ఎందుకంటే  సొంతంగా గెలవలేనని బాబుకు బాగా తెలుసు. నీకు విశ్వసనీయత ఉంటే... నువ్వు ధైర్యంగా 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగలవా? అని బాబును మరోసారి ప్రశ్నిస్తున్నాం. మాకు ప్రజలు ఓటేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టే.. ఒంటరిగా పోటీకి దిగుతామని ధైర్యంగా చెప్పగలం. మేము ఎవరితోనూ కలవబోమని స్పష్టంగా చెబుతున్నాం. 
- టీడీపీ మాదిరిగా పొత్తుల బేరసారాలు మాకు అవసరం లేదు. బాబుది ఎప్పుడూ వంచనాపూరిత రాజకీయమే. అవసరం ఉంటే బీజేపీతో పొత్తు అన్నాడు. అవసరం తీరాక.. మళ్లీ విడిపోయాడు. మళ్లీ అవసరమైతే ఆ పార్టీ కాళ్లు పట్టుకుంటాడు.  పవన్‌కళ్యాణ్‌ వంటి వారి గురించి నేను మాట్లాడడం ఏంటి? ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి గురించి రెండు సార్లు గెలిచిన నేను మాట్లాడడం సరికాదు. పవన్‌ కళ్యాణ్‌ను గుర్తించాల్సిన అవసరమే లేదు. స్థాయి లేని వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు. వారికి కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పని. 
- ముఖ్యమంత్రి గారు అధికారిక పర్యటనకు వెళ్ళాలంటే..  దారి పొడవునా ఎంత భద్రత ఉండాలి. దానికోసం ఎంతమందిని భద్రతకు కేటాయించాలి? ఎంతో వ్యయప్రయాసలవుతాయని ఆలోచించే  తెనాలి సభకు హెలికాఫ్టర్‌లో ప్రయాణించారు. అందులో తప్పేముంది, దానికీ విమర్శలా.. అంటూ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.

Back to Top