విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామని, సమస్యలు పరిష్కరించాలన్నది మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వేరు కాదన్నారు. ఇప్పటి వరకు ఉన్నంత మేర.., అందుబాటులో ఉన్న అవకాశాల మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామన్నారు. పీఆర్సీ అందులో ఒక్కటి. పీఆర్సీ లో మరికొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. విద్యా పరంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎంఈఓ ప్రమోషన్స్ పూర్తి చేశామని గుర్తు చేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనలు సూచనలు పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఆఖరికి పరిష్కరిస్తామన్నారు. సీపీఎస్ అంశానికొస్తే.., మా ప్రభుత్వ ఎన్నికల 100 హామీల్లో ఇదొక్కటి. ఈ హామీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపాం. జీపీఎస్ ద్వారా చేకూరే ప్రయోజనాలనూ ఉద్యోగులకు తెలియచేసాం. సీపీఎస్ విషయంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరి ఆమోదయోగ్యంగా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.