వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైయస్ఆర్ జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనకు పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. వచ్చే నెల నుంచి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సచివాలయాలు తనిఖీ చేస్తారని చెప్పారు. పెన్షన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నీరు–చెట్టులో గత టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని, తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు కరోనా బారినపడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.