శ్రీకాకుళం: గిరిజనుల అభివృద్ధి కోసం నాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి లక్షా ముప్పై వేల ఎకరాల భూ పట్టాలు ఇచ్చారని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మహానేత తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆదివాసీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని తన కార్యాలయం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆదివాసీల సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 5.2 శాతం ఆదివాసీలు ఉన్నారని.. వారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకునే విధంగా ఈ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.