సత్తెనపల్లి: పట్టిసీమ ప్రాజెక్టు ఎవరి డబ్బుతో కట్టారు..? ప్రభుత్వం డబ్బుతోనే కదా..? చంద్రబాబు ఇంట్లో సొమ్ముతో పట్టిసీమ కట్టారా..? అదేదో పగబట్టినట్లు వెంటాడుతోందని రామోజీ రావు కవిత్వం రాయడం దురదృష్టం. చంద్రబాబుకు మద్దతుగా రామోజీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జాలేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ మొత్తం దోపిడీనే అన్నారు. ఈనాడు రామోజీరావు కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోందదని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రామోజీరావు వైట్కాలర్ క్రిమినల్ అని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అని మంత్రి అంబటి అన్నారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు యుద్ధభేరీ పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్దకు తిరిగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు..శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దౌర్జన్యం చేసి ఓ కానిస్టేబుల్ కన్ను పోవడానికి కారణభూతుడయ్యాడు. మరో పక్క ఆయన కుమారరత్నం లోకేశ్ యువగళం పేరుతో పెద్దగా జనం రాకపోయినా ఆయన దోవన ఆయన వెళ్తున్నాడు. దత్తపుత్రుడేమో వారాహి ఎక్కి శృతిమించి విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదంతా చూస్తే మళ్లీ వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తున్నారనే ఆలోచనతో అసహనంతో వారు తిరుగుతున్నారు. దీనికి తోడు వారి ఎల్లోమీడియా..ముఖ్యంగా రామోజీరావు కూడా అసహనానికి లోనవుతున్నాడు. మొదటి పేజీలో పెద్ద పెద్ద వార్తలు రాసేసి ప్రజలను మార్చేద్దామనే తాపత్రయం పడుతున్నాడు. ఈ రోజు రామోజీరావు మొదటి పేజీలో కవిత్వంతో కూడిన ఒక వ్యాసాన్ని రాశాడు. పట్టిసీమ నాపై పగబట్టింది అనే ఉద్దేశ్యంతో సీఎం వైయస్ జగన్ బాధపడిపోతున్నారట. పట్టిసీమ కానీ, పోలవరం కానీ ఎవరి డబ్బుతో కట్టారు..? ప్రభుత్వం డబ్బుతోనే కదా..? చంద్రబాబు ఇంట్లో సొమ్ముతో కట్టినట్లు పట్టిసీమ కట్టారట..అదేదో పగబట్టినట్లు వెంటాడుతోందని కవిత్వం రాయడం దురదృష్టం. చంద్రబాబుకు మద్దతు పలకడం కోసం రామోజీరావు లాంటి వ్యక్తిని చూస్తుంటే జాలేస్తుంది. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి...తెలుగుదేశాన్ని మద్దతు పలుకుతున్న వ్యక్తి రామోజీరావు. నేడు టీడీపీ అతలాకుతలం అవుతుంటే భరించలేక అనేకమైన కథనాలు రాసి తన పత్రిక విలువ చెడగొట్టుకుంటున్నాడు.
పట్టిసీమ ఉపయోగించడం వల్ల సీఎం వైయస్ జగన్ బాధపడటం ఎందుకు..? దాన్ని ఉపయోగించడంలో తప్పేముంది..? పులిచింతలలోని నీటిని 45 టీఎంసీలను జాగ్రత్త చేసుకుంటూ.. గోదావరి నీళ్లు తీసుకోవడం దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసిన విధానం అది. దాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దోచుకునే కార్యక్రమంలో భాగంగా పట్టిసీమ కట్టాడు. పట్టిసీమ మొత్తం నిర్మాణానికి రూ.1,394 కోట్లు వెచ్చించారు. దీన్ని మెగా ఇంజనీరింగ్ వారికి కాంట్రాక్టు ఇచ్చారు. ఏడాది లోపు పూర్తి చేస్తే 22 శాతం ఇన్సెంటివ్ ఇస్తాను అన్నారు. 2016 మార్చి 29న గడువు పూర్తవుతుందనగా.. ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాసరే మార్చి 28వ తేదీన రిబ్బన్ కట్ చేశారు. దీనికి మెగా సంస్థకు 22 శాతం ఇన్సెంటివ్గా ఇచ్చారు. రూ.257 కోట్లు అదనంగా ఇచ్చారు. ఇన్సెంటివ్లు ఎక్కడా ఇవ్వరు. దీనిలో డబ్బులు మింగేయడం కోసమే పెద్ద స్కాం చేశారు. పట్టిసీమ అనుమతి తీసుకోగానే నీళ్లు వచ్చి కృష్ణా నదిలో పడిపోవు. నీళ్లు రావాలంటే 178 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి. ఆ కాల్వలను మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తవ్వారు. ఈ కాల్వల తవ్వకాల్లో భూసేకరణ ముఖ్యం. 12,402 ఎకరాలు మొత్తం భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిలో 2004–2009లో డాక్టర్ వైయస్ఆర్ హయాంలో 9,969 ఎకరాలు అంటే సుమారు 83.3 శాతం మేర భూసేకరణ చేయడంతో పాటు కాల్వల తవ్వకం పూర్తి చేశారు.ఆ కాల్వలకు పట్టిసీమ పేరుతో చంద్రబాబు పంపులు పెట్టి అంతా తానే చేశానని రూ.500 కోట్లు దోచేశాడు. దీని కోసం ఆనాడు రూ.298 కోట్లు ఖర్చు పెట్టి మరీ భూసేకరణ చేశారు.
2009 నుంచి 2014 వరకూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.93 కోట్లు ఖర్చు పెట్టి 589 ఎకరాల అంటే 4.74 శాతం మాత్రమే భూసేకరణ చేసింది. తర్వాత చంద్రబాబు 2014–19లో వచ్చాక 1,844 ఎకరాల భూసేకరణ చేశారు. సుమారు 14.9 శాతం భూసేకరణ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 85 శాతం చేస్తే చంద్రబాబు మిగిలిన 15 శాతం సేకరణ చేశాడు. కేవలం 15 శాతం భూసేకరణకు రూ.834 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంత ఖర్చు పెట్టారంటే విచ్చలవిడిగా డబ్బులు తన వాళ్లకు దోచిపెట్టారు. వైయస్ఆర్ హయాంలో చంద్రబాబు రెచ్చగొట్టి వారిని కోర్టులకు పంపి పోలవరాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న వారికే అ డబ్బులు అందించాడు. తాను అధికారంలోకి రాగానే వారికి రూ.834 కోట్లు ఖర్చు పెట్టించారు. చిత్తశుద్ధితో పట్టిసీమ కాల్వలను ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ వైయస్ఆర్. పోలవరం నుంచి గోదావరి జలాలను విజయవాడ బ్యారేజీ వద్దకు రావాలని, కృష్ణా డెల్టాను ఆదుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. దీన్ని అదనుగా చేసుకుని వైయస్ఆర్ హయాంలో 85 శాతం పనులు పూర్తైతే, మిగిలిన 15 శాతం పనులకు ఒక లిఫ్ట్ పెట్టి జబ్బలు చరుచుకున్నారు. దాన్ని మేం వినియోగించకూడదట.
అసలు గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ వైయస్ఆర్. దీనిపై రామోజీరావు వ్యాసాలు రాస్తున్నాడు. ఆయనకు ఈ వయసులో కక్ష బాగా పెరిగినట్లుంది. విచ్చలవిడి రాతలు రాస్తున్నాడు. పట్టిసీమ ఎవడి బాబుగాడి సొత్తూ కాదు...చంద్రబాబు ఇంట్లో సొమ్ము అంతకన్నా కాదు. అది ప్రభుత్వ నిధులతో కట్టినటువంటిది. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కట్టలేదు. వందలకోట్లు కాజేయాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ఈ పట్టిసీమను తన స్వార్ధానికి వాడుకున్నాడు. చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టగానే వర్షాలు పడటం ఆగిపోయాయి. అందువల్ల పట్టిసీమను మళ్లీ వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీరందించే కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని వాడటానికి భయపడాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది..? దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరాన్ని హైజాక్ చేసి పట్టసీమ ద్వారా డబ్బులు కాజేయాలని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి పిచ్చిపిచ్చి రాతలు రాసి పగ తీర్చుకోవాలనుకోవడం సిగ్గుమాలిన పని రామోజీ చేస్తున్నాడు.
పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించింది ఎవరు..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ నీటిని ఎందుకు వాడుకున్నాడు..? దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కలలు కని పనులు ప్రారంభించిన ప్రాజెక్టు అది. ఆతర్వాత మిగిలిన అరకొర పనులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మరి ఆనీళ్లు చంద్రబాబు వాడుకోలేదా..? ఆనాడు పగబట్టిందని రామోజీ రాతలు రాయలేదేం..? రామోజీ వైట్ కాలర్ క్రిమినల్. దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయనకు భయం పుట్టి సీఎం వైయస్ జగన్పై బురదజల్లుతున్నారు. పురుషోత్తంపట్నం కూడా రూ.1,427 కోట్లు ఖర్చు పెట్టారు. పర్యావరణ అనుమతులు లేవు. ఆగిపోయింది. దానిపై కోర్టులో వేయించింది కూడా చంద్రబాబే. ఎక్కడ డబ్బుంటే అక్కడ మింగేద్దామనే వ్యక్తి చంద్రబాబు. పట్టిసీమకు పర్యావరణ అనుమతులు తీసుకోని కారణంగా మా ప్రభుత్వం వచ్చాక రూ.24 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఇలాంటి తప్పిదాలన్నీ చేసి కోట్లాది రూపాయలు జేబులో వేసుకునేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉపయోగించుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఆయనకు మద్దతుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు రామోజీరావు కక్షకట్టి ఈ విధంగా వార్తలు రాస్తున్నారు.
దండుపాళ్యం బ్యాచ్ ఎవరు..? నిజం చెప్పాలంటే చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రడు పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు..వీళ్లు దండుపాళ్యం బ్యాచ్. రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీని అధికారంలోంచి ఏదో ఒక విధంగా దించేసి రాష్ట్రాన్ని దోచుకుందామనే చంద్రబాబు నాయకత్వంలో ఉన్న బ్యాచ్...దండుపాళ్యం బ్యాచ్. వృద్ధురాలిని చంపిన వ్యక్తి వెంకటేష్. అది హత్య సందేహమే లేదు..పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దండుపాళ్యం బ్యాచ్లో నంబర్ త్రీ పవన్ కల్యాణ్ వారిని పరామర్శించాడు. వెంకటేష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. అతను మృతిరాలి కుమారుడి వద్ద ఏదో పనిలో చేరాడు. అక్కడేం జరిగిందో తెలియదు..హత్య చేశాడు. అందువల్ల రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరూ దండుపాళ్యం బ్యాచ్ అంటున్నాడు. ఇంతకు ముందు హ్యూమన్ ట్రాఫికర్లు అన్నావ్...తర్వాత నాలుక కొరుక్కుని అందర్నీ అనలేదు అంటున్నాడు. మళ్లీ ఇవాళ దండుపాళ్యం బ్యాచ్ అంటున్నాడు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది.
జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తాడా..? అధికారంలోకి రావాలి కదా..? అలా రావాలని కనీసం పవన్ కల్యాణ్ అన్నా అనుకుంటున్నాడా..? నువ్వు అధికారంలోకి రావాల్సినన్ని సీట్లు తీసుకుంటావా..? పాతిక పరకా సీట్లకు కక్కుర్తి పడే పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తానని చెప్పడానికి సిగ్గు ఎలా లేదు..? చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం నీ సర్వశక్తులు ఒడ్డుతున్నావనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా నేను ఓట్లు చీలనివ్వను..నాకు వ్యూహాలున్నాయి అంటాడు కానీ ఎన్ని సీట్లు తీసుకుంటాడో చెప్పడు. అసలు నువ్వు ఎన్ని సీట్లు తీసుకుంటావు..తీసుకుంటే ఒక పాతిక తీసుకుంటావ్...దానితో అధికారంలోకి వస్తావా..? జనసేన కార్యకర్తలకు చెప్తున్నా..మిమ్మల్నిముంచుతాడు పవన్ కల్యాణ్..చంద్రబాబును పైకి లేపుతాడు. ఆయనకు ఏమీ అర్ధం కావడం లేదు.. సీఎం వైయస్ జగన్పై కక్ష..చంద్రబాబు ఇస్తున్న క్యాష్తో ఆయన కళ్లు బైర్లు కమ్మారు.
రిషికొండను దోచుకుంటున్నామా..? ఆ కొండ ప్రభుత్వానికి కాదా..? అక్కడ కడుతున్న కట్టడాలు ప్రభుత్వానికి కాదా..? సీఆర్జడ్ కేంద్ర ప్రభుత్వానిది కాదా..? వాళ్లు అనుమతి ఇస్తే టూరిజం డిపార్ట్మెంటు అక్కడ బిల్డింగులు కడుతున్నారు. సీఎం వైయస్ జగన్ దోచుకున్నారు అంటాడేంటి..? జగన్ సొంత ఇళ్లేమన్నా కట్టుకుంటున్నాడా..? టూరిజం తరఫున అక్కడ బిల్డింగులు కడుతున్నారు. వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటాడా లేదా అన్నది ఆయన చాయిస్. కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న బిల్డింగుల్లో మోసం ఏంటి..? దోచుకోవడం ఏంటి..? ఇంతకు ముందు జూబ్లీ హిల్స్లో ఎన్ని కొండలు తొలుచుకుని బిల్డింగులు కట్టుకోవడం లేదా..? విశాఖలో ఇంతకు ముందు ఎన్ని కొండలున్నాయి... భవనాలు రాలేదా..? దీంట్లో సీఎం వైయస్ జగన్ దోచుకుంటున్నాడంటూ ఫ్రస్టేషన్తో గుడ్డకాల్చి నెత్తినేస్తున్నాడు. ఫ్రస్టేషన్తో పోలీసులతో ఘర్షణ పడి జొరబడి వెళ్లి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు పుంగనూరులో పోలీసులపై దౌర్జన్యం చేశాడు..ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే చంద్రబాబైనా..పవన్ కల్యాణ్ అయినా మూల్యం చెల్లించకతప్పదు. ఊరికే చిందులేస్తే..పోలీసులను ఇష్టం వచ్చినట్లు తిడితే కుదరదు. ఎవరున్నా సరే..శాంతి భద్రతలు కాపాడాల్సిన వారు పోలీసులు. వాళ్లమీద దౌర్జన్యం చేసేందుకు కుట్రపూరితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.
నాకు చేసింది తీవ్రమైన అన్యాయమే కానీ...నా కుమారుడి తండ్రికి ఒక సారి అవకాశం ఇవ్వండి అని రేణుదేశాయ్ అంటున్నారు. అమ్మా నీకే ఇంత ద్రోహం చేస్తే రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తాడో కనిపెట్టలేకపోతున్నావు. నీ విశాల దృక్పదానికి ఇది తార్కాణం..నీ కొడుకుకు తండ్రిగా నువ్వు అతన్ని గౌరవిస్తున్నందుకు శభాష్. అసలు సిసలైన భారత మహిళగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కానీ...నీ భర్తకు మరొకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీలాగానే అందర్నీ మోసం చేస్తాడనే భావన వారిలో ఉంది. నిన్నే కాదు..నీకు ముందున్న ఆమెను మోసం చేశాడు. ఇప్పుడున్నామె అసలు మాట్లాడటం లేదు. ఆమెనూ మోసం చేశాడు అంటున్నారు. మహిళలు భర్త దుర్మార్గుడైనా గౌరవించే సంప్రదాయం ఉన్న ఈ సమాజంలో ఆమె ఒక మంచి స్త్రీగా మాట్లాడారు కానీ ఆమెకు ఆ ఉద్దేశం లేదు.
అసలు వాలంటీర్ అనేది ఉద్యోగమే కాదు అంటుంటే పోలీసు వెరిఫికేషన్ అని అజ్ఞానంగా మాట్లాతారేంటి..? కక్ష స్వభావంతో మాట్లాడటం తప్ప వాస్తవాలు కాదు. చంద్రబాబు పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయలేదు. ఆయన చేసింది కేవలం 48 శాతం మాత్రమే. పోలవరం ప్రాజెక్టు వద్దే చర్చకు నేను సిద్ధం. పాపం చేస్తే పకృతి పగబడుతుంది..చంద్రబాబు పాపాలు చేశాడు. చంద్రబాబు అధికారం కోసం దండుపాళ్యం బ్యాచ్ లా వ్యవహరించాడు. సొంత మామానే చంపేసే ప్రయత్నం చేసిన దుర్మార్గుడు. రాజకీయ్లాలో అనేక పాపాలు చేసిన వ్యక్తి చంద్రబాబు. అందువల్లే పకృతి పగబట్టింది..అందుకే బాబు అధికారంలో ఉంటే వర్షాలు పడవు. కరువు విలయతాండవం చేస్తుంది. అందుకే ఆయన్ను అధికారంలోకి తీసుకురావడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అబద్దాలు అడితే ఆడపిల్లలు పుడతారనేది పాత సామెత. కొత్త సామెత అబద్దాలు ఆడితే లోకేశ్ లాంటి పప్పులు పుడతారు. పాపాలు చేస్తే పకృతి పగబడుతుంది.
ఈ రెండూ చంద్రబాబు జీవితం నుంచి మనం నేర్చుకోవాలి.