తాడేపల్లి: రాష్ట్రంలో ఖచ్చితంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని.. జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఫలితాల ముందు తాత్కాలిక ఆనందాలకు తాము వెళ్లడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని.. టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత ఆయనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈసీ చంద్రబాబు వైరస్తో ఇన్ఫెక్ట్ అయిందంటూ సజ్జల మండిపడ్డారు.