హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ కోసం వైయస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం మానుకోవాలని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాల మధ్య విభేదాలు కలిగేలా కొందరూ మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. చంద్రబాబు పచ్చి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరకు హత్యా రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. మహిళపై నిందలు వేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదన్నారు. తెలుగు జాతి కలిసి ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్తో వైయస్ జగన్ చర్చలు జరిపారన్నారు. ఈ చర్చలపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని.. కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని.. ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు.