తాడేపల్లి: పారిశ్రామిక ప్రగతిపై సీఎం చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారాలు చేస్తోందని వైయస్ఆర్సీపీ మండిపడింది. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో సహా ఎండగట్టింది. ఫేక్ ప్రాపగాండాను బద్ధలు చేస్తూ ఆర్బీఐ గణాంకాలు చూపింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘‘తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనికట్టుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలివెళ్లిపోయారని విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు వైయస్ జగన్ గారి హయాంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదని, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు సందర్భం అయినప్పటికీ, కానప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అధోగతి పాలైనట్లుగా మాట్లాడుతున్నారు. అయితే 2019-24 మధ్య వాళ్లు చెబుతున్నది నిజం అయి ఉంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉండేది కాదు కదా. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్-1 దేశవ్యాప్తంగా – నంబర్ 5లో ఉంది. పరిశ్రమల రంగం (Industry Sector) వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ – నంబర్ 1 దేశవ్యాప్తంగా – నంబర్ 8 లో ఉంది. ఇప్పుడు చెప్పండి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? లేకపోతే ఇంతకుముందు ఎప్పుడూ చూడని పురోగతిని చూశామా? మీరే చెప్పండి?’’ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.