అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా వివ‌రిస్తాం

చంద్రబాబు అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాలి 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు

అమ‌రావ‌తి:  ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామ‌ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయ‌ని ..ఈ స‌మావేశాల‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రావాల‌ని అన్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌పై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు . అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు.  రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి.. జీరో అవ‌ర్ తర్వాత బీఏసీలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

 అన్ని అంశాలపై చర్చ బాగా జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందని చీఫ్ విప్‌ ప్రసాద్‌ రాజు తెలిపారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానుల విషయంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. అవసరమైతే మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఎప్పుడు ప్రవేశపెడతారు అనేది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా బిల్లులు ఉంటాయ‌ని చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు.

Back to Top