వైయస్ఆర్ జిల్లా: మన భారతదేశం మతసామరస్యానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరు మహమ్మద్ ప్రవక్త సల్లేవుల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి.అంజాద్ బాష అన్నారు. మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని కడప నగరంలోని అల్మాస్ పేట నుంచి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా , పొట్టి శ్రీరాములు సర్కిల్, 7 రోడ్లు మీదుగా, పాత బస్టాండ్, ఎన్టీఆర్ కూడలి వరకు ముస్లిం సోదరులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి.అంజాద్ బాషా, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాష మాట్లాడుతూ.... ప్రవక్త మహమ్మద్ సల్లేవుల్లాహు వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదర సోదరీమణులు ఆయన జన్మ దినోత్సవాన్ని "మీలాద్ ఉన్ నబీ" పేరుతో పండుగను జరుపుకుంటారన్నారు. మహమ్మద్ ప్రవక్త సల్లేవుల్లాహు వసల్లం అల్లా పంపిన చివరి ప్రవక్త అని తెలిపారు. ఆ ప్రవక్త కేవలం ముస్లింలకే కాకుండా యావత్తు మానవాళికి ప్రవక్తగా పంపించారన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరూ సుఖ శాంతులతో సుభిక్షంగా జీవించాలని దేవుడిని ప్రార్థించారు.