కృష్ణా జిల్లా: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలోని వైయస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ ఇంచార్జ్ పేర్ని కిట్టు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పేర్ని నాని, సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలనకు అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని అన్నారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని నమ్మి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మనువాదులు, మత ఛాందస వాదులు అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆయనను ఒక వర్గానికో కులానికో పరిమితం చేయడం అవమానకరమని విమర్శించారు. తన ప్రతిభతో భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయనేది వాస్తవమని, ఆయన ఆశయాల సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.