విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖకు ఐదు జాతీయ అవార్డులు వచ్చినట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. దేశంలోనే మూడు నంబర్ వన్ అవార్డులు జీసీసీ సాధించినట్లు ఆమె వెల్లడించారు. వన్ ధన్ యోజనలో ఏపీకి మొదటి స్థానం వచ్చిందని, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, కనీస మద్ధతు ధర కల్పనలో రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందన్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్లో కూడా మొదటి స్థానంలో గిరిజన సంక్షేమ శాఖ నిలిచిందన్నారు. రూ. 4.50 కోట్ల చిన్న తరహా ఉత్పత్తుల సేకరణలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. సీఎం వైయస్ జగన్ మార్గదర్శకంలోనే జీసీసీ ఉత్తమంగా పనిచేస్తోందని పుష్పశ్రీ వాణి తెలిపారు. జాతీయ స్థాయిలో జీసీసీకి 5అవార్డులు రావడం గర్వకారణమని, కరోనా విపత్తులోనూ జీసీసీ మంచి ఫలితాలు సాధించిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.