అమరావతి: ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గు సరఫరా చేయాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఒడిశా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 4,010 మెగావాట్లు, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటిడె, సింగరేణి కోల్ కాలరీస్ నుంచి బొగ్గు సరఫరా కోసం ఒప్పందాలు ఉన్నాయని సీఎం వైయస్ జగన్ లేఖలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సింగరేణి కోల్ కాలరీస్ నుంచే బొగ్గు సరఫరా అయ్యేదని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత సింగరేణి కోల్ కాలరీస్ను తెలంగాణకు ఇచ్చారని పేర్కొన్నారు. బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని,దీని వల్ల రాష్ట్ర విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయిందని లేఖలో వివరించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు ఈ పరిస్థితి తీవ్ర అవరోధంగా మారిందని చెప్పారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయని, ఐబీ వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు. ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్ఘడ్, తెలంగాణ బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీష్ఘడ్లో ఒకటి చొప్పున ఏపీఎండీసీకి కేటాయించారని చెప్పారు. ప్రతి గని నుంచి 5 ఎంఎంపీటీఏలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీత నిర్వహణ వ్యయం అధికంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు గనుల చట్టం 2015 ప్రకారం ట్రాంచీ-6ను ఏపీ జెన్కో వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని చెప్పారు. మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోందని అదనపు ఉత్పాదన కోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మందాకిని "ఏ' కోల్ బ్లాక్, తాల్చేరు కోల్ ఫీల్డ్ అంగుల్ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని ప్రధానికి సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన విధంగా 50 ఎంఎంటీఏల బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్కోకు కేటాయించాలని కోరారు. Read Also: బాబుకు సిగ్గు, ఎగ్గూ ఏమీ లేవు