ప్ర‌తి పేద కుటుంబం నుంచి ఆణిముత్యాలు రావాల‌నే త‌ప‌న‌..

నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం  

విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌ 

పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది 

ఇంటర్‌లో సత్తాచాటిన 26 మంది 

నగదు పురస్కారంతో పాటు సరి్టఫికేట్, మెడల్‌ ప్రదానం  

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు 22,710 మంది 

విజయవాడ : గత ప్రభుత్వంలో పెత్తందార్ల చేతిలో బందీ అయిన విద్యావ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. లక్షల్లో డబ్బు గుంజే కార్పొరేట్‌ స్కూళ్ల కన్నా మిన్నగా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించింది. ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చి, డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టి, మెరుగైన విద్యనందిస్తోంది. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక లీడర్‌ వంటి ఆణిముత్యాలు రావాలన్న తపన, తాపత్రయంతో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. 

ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్‌మీడియ‌ట్‌ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు. 

వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు’ను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌లు పరిశీలించారు.  

22,710 మంది విద్యార్థులకు ప్రోత్సాహం 
ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగనన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్‌లో  విద్యార్థులను ఎంపిక చేసింది. పదో తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్‌/ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ తదితర) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిలో ప్రతి స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించింది. 

ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్‌ఈసీ(నాలుగు) గ్రూపుల్లో ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రోత్సాహం అందించనుంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 12 నుంచి 19 వరకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్‌ సర్టిఫికెట్‌తో సత్కరించింది. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత విద్యాసంస్థలకు మొమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం సన్మానించింది.  

జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలిలా.. 
పదో తరగతి విద్యార్థులకు.. 

- రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000, విద్యార్థులు 42 మంది. 
- జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. 
- నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000,  విద్యార్థులు 681 మంది. 
- పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది.  

ఇంటర్‌ విద్యార్థులకు.. 
- రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం  
- జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం  
- నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం  
- మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710  
- ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్‌ అందజేస్తారు. 

Back to Top