రేపు సీఎం వైయ‌స్ జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటన

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్‌ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. 

సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటన ఇలా..
► ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. 
► 11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. 
► 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్‌ వద్దకు చేరుకుంటారు. 
► 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
► 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.    

సంగం బ్యారేజీ వద్ద వైయ‌స్ఆర్, గౌతంరెడ్డి విగ్రహాలు
 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దివంగత సీఎం వైయ‌స్ఆర్, దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిల కాంస్య విగ్రహాలతో పాటు, నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి వద్ద వైయ‌స్ఆర్ విగ్రహాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ తయారు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ మేరకు ఈ మూడు విగ్రహాలను తయారు చేసినట్టు రాజ్‌కుమార్ చెప్పారు. ఒక్కో విగ్రహాన్ని 2.5 టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తుతో తయారు చేశానన్నారు. గౌతంరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సంగం బ్యారేజీ వద్ద వైయ‌స్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తయారు చేయాల్సిందిగా తనకు సూచించారని గుర్తు చేసుకున్నారు. కానీ వైయ‌స్ఆర్  విగ్రహంతో పాటు గౌతంరెడ్డి విగ్రహాన్ని కూడా తయారు చేయాల్సి వచ్చిందని రాజ్‌కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

తాజా వీడియోలు

Back to Top